గువాహటి: కోవిడ్-19 బారీన పడి కోలుకున్న వారికి కొవిషీల్డ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ సరిపోతుందని, రెండో డోస్ అవసరం లేదని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. ఈశాన్య రాష్ట్రాలు, దిబ్రూగఢ్లో పరిశోధకులు జరిపిన అధ్యయనం ప్రకారం కోవిడ్-19 బారీన పడి ఇమ్యూనిటీ పొందిన వారికి సింగిల్ డోస్ కొవిషీల్డ్ సరిపడా భద్రత కల్పిస్తుందని ఈ అధ్యయనం పేర్కొంది.
మహమ్మారి నుంచి కోలుకున్న వారు వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోకుంటే దేశంలో వ్యాక్సిన్ల కొరత నివారణకు సహకరించిన వారవుతారని తెలిపింది. 18-75 ఏండ్ల లోపు స్త్రీ, పురుషులపై ఈ అధ్యయనం జరిగింది.
ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత మాదిరిగా రెండో డోస్ తీసుకున్న వారిలో అత్యధికంగా యాంటీబాడీలు ఎదగలేదని ఈ అధ్యయనం నివేదికలు చెబుతున్నాయి. రెండు డోస్లు తీసుకున్న వారితో పోలిస్తే, కోవిడ్-19 నుంచి కోలుకున్న తర్వాత కోవిషీల్డ్ తొలి వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఐజీఈ యాంటీబాడీ అత్యధికంగా డెవలప్ అయిందని ఈ అధ్యయన నివేదిక తెలిపింది.
తోలి డోస్కు 25-35 రోజుల ముందు.. రెండో డోస్ తీసుకున్న 25-35 రోజులకు యాంటీ బాడీలను పరీక్షించుకవాలని సూచించింది. ఈ అధ్యయనంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న 121 మంది పాల్గొన్నారు.
ఈ విషయమై వచ్చేవారం భారీ స్థాయిలో అధ్యయనాన్ని చేపట్టనున్నట్లు ఏఎంసీ పాథాలజీ అసిస్టెంట్ ప్రోఫెసర్ డాక్టర్ గాయత్రి గొగోయ్ పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో డాక్టర్ బిశ్వజ్యోతి బొర్కాకోటీ తోపాటు పరిశోధకులు మందాకిని దాస్ సర్మాహ్, చంద్రకాంత్ భట్టాచార్య, నర్గీస్ బాలి తదితరులు పాల్గొన్నారు.