మూడు నెలల్లో ఇదే మొదటిసారి
దేశంలో కొత్తగా 2,067 కొవిడ్ కేసులు
ఢిల్లీలో మాస్కు ధరించకుంటే జరిమానా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కరోనా వ్యాప్తి రేటును సూచించే ఆర్ విలువ మళ్లీ పెరుగుతుండటం గుబులు రేపుతున్నది. మూడు నెలల తర్వాత దేశంలో మళ్లీ ఆర్ వ్యాల్యూ ఒకటి దాటిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథ్మ్యాటికల్ సైన్సెస్ పేర్కొన్నది. గత కొన్ని వారాలుగా ఆర్ వాల్యూ క్రమంగా పెరుగుతున్నదని, ఈ వారంలో ఇది 1.07కి చేరిందని గణితవేత్త సితాభ్ర సిన్హా తెలిపారు. చివరిగా జనవరి మూడో వారంలో ఆర్ విలువ 1.28గా ఉన్నది. ఆర్ విలువ పెరుగుదలకు ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్లో వెలుగుచూస్తున్న కొత్త కేసులే కారణమని సితాభ్ర సిన్హా పేర్కొన్నారు.
‘1’ దాటితే ప్రమాద ఘంటికలే
కరోనా వ్యాప్తిని ఆర్ ఫ్యాక్టర్ ద్వారా అంచనా వేస్తారు. ఆర్ విలువ ఒకటి కంటే పెరిగితే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టే. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అని అర్థం. ఉదాహరణకు ఆర్ విలువ 1.2గా ఉంటే వైరస్ సోకిన 10 మంది నుంచి సరాసరిన మరో 12 మంది సోకుతున్నట్టు. 1 కంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నట్టు. ఢిల్లీ, యూపీల్లో ఆర్ వాల్యూ 2 కంటే ఎక్కువగా ఉన్నదని, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా 1 కంటే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నదని సిన్హా పేర్కొన్నారు. ఒమిక్రాన్ పీక్ దశ సమయంలో 2021,డిసెంబర్ 30-2022 జనవరి 10 మధ్య దేశంలో ఆర్ వాల్యూ అధిక స్థాయిలో 2.98కి చేరింది.
12 వేలు దాటిన యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నది. బుధవారం 2,067 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 12,340కి చేరింది. పాజిటివిటీ రేటు 0.49గా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో కేసుల పెరుగుదల నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడాన్ని ఢిల్లీ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించింది.