ముంబై: కరోనా రోగిని చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయి. దీంతో అతడు ఆక్సిజన్ మాస్క్తో నిరసన తెలుపుతూ మరణించాడు. మహారాష్ట్రలోని నాసిక్లో బుధవారం ఈ ఘటన జరిగింది. 38 ఏండ్ల బాబాసాహెబ్ కోల్కు మూడు రోజుల కిందట కరోనా సోకింది. తొలుత బైట్కో ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అక్కడి నుంచి మరో ఆసుపత్రికి, అక్కడి నుంచి ప్రభుత్వ వైద్య కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అయితే మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పడకలు లేవని చెప్పారు. దీంతో మరి కొన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకునేందుకు నిరాకరించారు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రికి రాగా ఆక్సిజన్ పెట్టారు.
అయితే అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో బాబాసాహెబ్ బుధవారం ఆక్సిజన్ సిలిండర్, మాస్క్తో నాసిక్ మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపాడు. గంట తర్వాత మున్సిపల్ సిబ్బంది స్పందించి అతడ్ని మున్సిపల్ కార్పొరేషన్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆక్సిజన్ స్థాయిలు 40 శాతం తగ్గాయని, చివరకు గురువారం 1 గంటకు మరణించినట్లు బంధువులు తెలిపారు. కరోనా సోకిన తన భర్తను చేర్చుకునేందుకు పలు ఆసుపత్రులు నిరాకరించాయని ఆయన భార్య ఆరోపించింది.
మరోవైపు కరోనా రోగిని ఆక్సిజన్ సిలిండర్తో మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన తెలుపాలని ఎవరు చెప్పారు, ఎవరు ప్రొత్సహించారు అన్నదానిపై నాసిక్ మున్సిపల్ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.