బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే ఇద్దరిలో ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అవుతున్నట్లు అధికారులు చెబుతున్న విషయం తెలిసిందే. అయితే మే 17వ తేదీన బెంగళూరులో అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అధికారులు వెల్లడించారు. ఈ కేసుల తీవ్రత వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందన్నారు. జూన్ 11వ తేదీ వరకు కేసులు స్థిరంగా నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపిన అధికారులు.. ఈ సమయంలో 14 వేల మంది మరణించే అవకాశం ఉందని అంచనా వేశారు.
కర్ణాటకలో నేటి నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. కరోనా తీవ్రత దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. గత 10 రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో కర్ణాటక ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఇవాళ ఉదయం 6 గంటలకు ప్రారంభమైన లాక్డౌన్.. మే 24 ఉదయం 6 గంటల వరకు కొనసాగనుంది.
గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 47,930 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడి 490 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 18,776కు పెరిగింది. ప్రస్తుతం 5,64,485 యాక్టివ్ కేసులున్నాయి.