న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అన్ని దేశాలను ప్రభావితం చేస్తున్నదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. ఇవాళ భారత్-సెంట్రల్ ఏసియా మూడో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జయశంకర్.. వ్యాక్సిన్ల తయారీ, ఎగుమతుల్లో భారత్ దూసుకుపోతున్నదని తెలిపారు. ఇప్పటివరకు ప్రపంచంలోని 90కి పైగా దేశాలు భారత్ నుంచి వ్యాక్సిన్లు దిగుమతి చేసుకున్నాయన్నారు.
కరోనా మహమ్మారి సమయంలో వివిధ దేశాల్లోని భారతీయ విద్యార్థుల సంక్షేమం ఆయా దేశాలతో సంబంధాల వేగాన్ని స్తంభించేలా చేసిందని చెప్పారు. ఈ పరిస్థితిని పరస్పరం మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఆఫ్ఘనిస్థాన్తో మనందరికి మంచి సంబంధాలు ఉన్నాయని, అక్కడ ఉగ్రవాదం, మాదకద్రవ్యాల సరఫరా.. మహిళలు, పిల్లలు, మైనారిటీల హక్కుల హరణం ఆందోళన కలిగించే అంశాలని జయశంకర్ పేర్కొన్నారు.