Supreme Court | కరోనాతో మరణించిన కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లింపులో జాప్యం జరుగడం పట్ల సుప్రీంకోర్టు మండి పడింది. సకాలంలో పరిహారం చెల్లించకపోవడంలో ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో లక్ష మందికిపైగా మృతి చెందితే 37వేల దరఖాస్తులే వచ్చినా.. ఒక్కరికీ పరిహారం అందలేదంటని జస్టిస్లు ఎమ్మార్ షా, బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం నిలదీసింది. మహారాష్ట్ర సర్కార్ తీరు హాస్యాస్పదం అని, దీన్ని సహించేది లేదని జస్టిషా తేల్చి చెప్పారు. పరిహారం పంపిణీకి సమయం కావాలని విజ్ఞప్తి చేసిన మహారాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై కఠిన చర్యలు తీసుకుంటాం.. దాన్ని జేబులో పెట్టుకుని సీఎంకు ఇవ్వండన్నారు. వెంటనే పరిహారం చెల్లించాలని జస్టిస్ షా ఆదేశించారు.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 19 వేల మంది మరణిస్తే 467 దరఖాస్తులు వచ్చాయని, ఇప్పటికీ 110 మందికే పరిహారం చెల్లించామని తెలిపింది. రాజస్థాన్లో సుమారు 9000 మంది మరణిస్తే 595 దరఖాస్తులు వచ్చినా ఒక్కరికీ పరిహారం చెల్లించలేదని ధర్మాసనం గుర్తు చేసింది. మానవత్వంతో వ్యవహరించాలని రాజస్థాన్ ప్రభుత్వానికి చెప్పాలని ఆ రాష్ట్ర న్యాయవాదికి సూచించింది. ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 10న జరుగనున్నది.