న్యూఢిల్లీ: దేశంలో లాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా మహమ్మారి చేపకింద నీరులా విస్తరిస్తున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య పెరుగుతున్నది (Covid Cases Rise). తాజాగా గురువారం ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 300 కొత్త కేసులు నమోదయ్యాయి. గత ఏడు నెలల్లో ఢిల్లీలో ఒకేరోజు 300 కొత్త కేసులు నమోదవడం తొలిసారి.
అదేవిధంగా రోజువారీగా నిర్వహిస్తున్న కొవిడ్ పరీక్షల్లో ఇవాళ్టి పాజిటివిటీ రేటు (Positivity rate) కూడా 13.89 శాతంగా ఉన్నది. ఢిల్లీ ఆరోగ్య శాఖ (Delhi health ministry) ఈ వివరాలను వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు 31న 2.58 శాతం పాజిటివిటీ రేటుతో 377 కొత్త కేసులు నమోదైన తర్వాత ఢిల్లీలో మళ్లీ 300 కేసులు రికార్డయింది తెలిపింది. కొత్త కేసుల విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో కొవిడ్ పరిస్థితిని చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నది.
ఢిల్లీ ముఖ్యమంత్రి (Delhi CM) అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీలో కొవిడ్ విస్తరిస్తున్న తీరు, మరింత వ్యాపించకుండా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి (Delhi health minister) సౌరవ్ భరద్వాజ్ (Saurab Bharadwaj) ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.