Covid-19 | న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: దేశంలో కొవిడ్ మళ్లీ విజృంభిస్తున్నది. కొత్త కేసులు ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ ఆందోళనకర విషయం వెల్లడించారు. మే నెల మధ్యలో కొత్త కొవిడ్ కేసుల నమోదు తారస్థాయికి చేరే అవకాశం ఉన్నదని, రోజుకు 50 వేల నుంచి 60 వేల వరకు నమోదవుతాయని పేర్కొన్నారు. కేసుల పెరుగుదలపై గణిత నమూనా ఆధారంగా ఈ అంచనా వేసినట్టు తెలిపారు.
గత 24 గంటల వ్యవధిలో కరోనాతో 27 మంది మరణించారు. కొత్తగా 10,753 కొవిడ్ కేసులు వెలుగుచూశాయని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం వెల్లడించింది. గత ఆర్నెల్లలో ఒక రోజులో నమోదైన అధిక మరణాలు ఇవే. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 53,720కి చేరింది.