న్యూఢిల్లీ, జూలై 14: కరోనా నియంత్రణపై కార్యనిర్వాహక వర్గం పరిధిలోకి కోర్టులు జోక్యం చేసుకోగలవా?, చేసుకుంటే ఎంతవరకు అనేది పరిశీలిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వైద్య వ్యవస్థ అంతా ‘దేవుడి దయ’ అన్నట్టుగా ఉందని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారిస్తున్నది. ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టు జోక్యం చేసుకోవడం అవసరమా, ‘దేవుడి దయ’ వ్యాఖ్యలు సబబేనా కాదా పరిశీలిస్తామని జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి ధర్మాసనం పేర్కొంది. వ్యాక్సిన్ ఫార్ములాను తీసుకుని, వ్యాక్సిన్ను తయారుచేయమని స్థానిక కంపెనీలను ఎలా ఆదేశిస్తారు? అని జస్టిస్ శరణ్ ప్రశ్నించారు. కార్యానిర్వాహక వర్గం పరిధిలోకి వచ్చే అంశాలు ఉంటాయని, అదీ సంక్షోభం వేళ ప్రతిఒక్కరూ ఆచితూచి వ్యవహరించాలని, ఎవరే పనిచేయాలనేది గమనించాలని జస్టిస్ మహేశ్వరి వ్యాఖ్యానించారు.
కరోనా వేళ కావడ్ యాత్రా?
న్యూఢిల్లీ, జూలై 14: కరోనా ముప్పును లెక్కచేయకుండా కావడ్ యాత్రకు భక్తులను అనుమతించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని సుప్రీంకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని యూపీ సర్కారుతో పాటు కేంద్రానికి, ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కూడా జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్ నేతృత్వంలోని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జూలై 25 నుంచి ఈ యాత్ర ప్రారంభం కానున్న దృష్ట్యా శుక్రవారంలోపు అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రజలు ఎక్కడా సమూహాలుగా చేరవద్దని ఒకపక్క స్వయంగా ప్రధానమంత్రి చెబుతుంటే… ఈ యాత్రకు అనుమతించడంపై ప్రజలు గందరగోళానికి గురవుతున్నారని వ్యాఖ్యానించింది. యూపీ ప్రభుత్వం యాత్రకు అనుమతించగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం మాత్రం అనుమతి నిరాకరించింది. 15 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా హరిద్వార్కు ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ర్టాల నుంచి భారీసంఖ్యలో శివభక్తులు వస్తుంటారు. అక్కడ గంగానది జలాలను సేకరించి తమ ప్రాంతాల్లోని శివాలయాల్లో అభిషేకం కోసం తీసుకెళతారు. కరోనా దృష్ట్యా గతేడాది కావడ్ యాత్రను రద్దు చేశారు. అంతకుముందు ఏటా దాదాపు మూడు కోట్ల మంది భక్తులు వచ్చేవారు.
కరోనా అంటే జనానికి పట్టింపే లేదు!
న్యూఢిల్లీ, జూలై 14: కరోనా పట్ల ప్రజలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కొవిడ్ నిబంధనలంటే పట్టింపే లేకుండా తిరుగుతున్నారని కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాటిని అమలు చేయాల్సిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. ఈ మేరకు కేంద్రం హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ర్టాలకు లేఖ రాశారు. ప్రజా రవాణా, మార్కెట్లలో, హిల్ స్టేషన్ల వద్ద ప్రజలు భారీగా గుమికూడుతున్నారని, కనీసం మాస్కులు కూడా ధరించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రాష్ర్టాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనన్నారు.
పరీక్ష ఫీజుల రీఫండ్పై ఏమంటారు?
న్యూఢిల్లీ, జూలై 14: పది, పన్నెండవ తరగతుల బోర్డు పరీక్షల కోసం వసూలు చేసిన ఫీజులను తిరిగి విద్యార్థులకు చెల్లించే విషయంపై ఎనిమిది వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు సీబీఎస్ఈని ఆదేశించింది. కరోనా కారణంగా సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. పరీక్ష ఫీజులపై దీపా జోసెఫ్ అనే మహిళ కోర్టుకు వెళ్లారు. తన కుమారుడికి పరీక్ష ఫీజు కింద రూ.2,100 కట్టినట్టు చెప్పారు. దానిని రీఫండ్ చేయాలని కోరారు.