Maintenance | భర్తతో విడిపోయి విడిగా ఉంటున్న భార్యకు రూపాయి, రెండ్రూపాయల నాణాల రూపంలో జీవన భృతి ఇచ్చేందుకు జైపూర్ కోర్టు అనుమతి ఇచ్చింది. జైపూర్ వాసులు దశరత్ కుమావత్, సీమా కుమావత్ దంపతులు కొంత కాలంగా విడిగా ఉంటున్నారు. వారి విడాకుల కేసును ఫ్యామిలీ కోర్టు విచారిస్తున్నది. ఈ నేపథ్యంలో సీమా కుమావత్ దాఖలు చేసిన జీవన భృతి కేసులో ప్రతి నెలా రూ.5000 జీవన భృతి చెల్లించాలని దశరత్ కుమావత్ను కోర్టు ఆదేశించింది.
కానీ, 11 నెలలుగా సీమా కుమావత్ కు, దశరత్ కుమావత్ జీవన భృతి చెల్లించడం లేదు. దీనిపై సీమా కుమావత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ నెల 17న రికవరీ వారంట్ కింద అరెస్ట్ చేశారు. ఈ కేసు మంగళవారం కోర్టు ముందు విచారణకు వచ్చింది. దశరత్ కుటుంబ సభ్యులు ఏడు బస్తాల్లో రూ.55 వేల విలువైన రూపాయి, రెండ్రూపాయల నాణాలను కోర్టుకు తీసుకొచ్చారు.
భార్య కేసు నమోదు చేయడంతో జీవన భృతి చెల్లించనందుకు దశరథ్ కుమావత్ను పోలీసులు అరెస్ట్చేశారు. దీంతో దశరథ్ కుటుంబ సభ్యులు రూపాయి, రెండ్రూపాయి నాణాల రూపంలో రూ.55 వేలు కోర్టుకు తీసుకొచ్చారు. ఇది `మానసిక వేధింపుల` కిందకు వస్తుందని సదరు భార్య తరఫు న్యాయవాది వాదించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం తన క్లయింట్ను వేధించడానికే రూపాయి, రెండ్రూపాయల నాణాలను తీసుకొచ్చారన్నారు.
అయినా రూపాయి, రెండ్రూపాయి నాణాలు చెల్లుబాటవుతాయని పేర్కొంటూ అలా జీవన భృతి చెల్లించడానికి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే, ఆ నాణాలను రూ.1000 చొప్పున లెక్కగట్టి ప్యాకెట్లలో చెల్లించాలని ఆ దశరథ్ను ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను న్యాయమూర్తి వచ్చేనెల 26కు వాయిదా వేశారు. అప్పటి వరకు ఈ నాణాలు కోర్టు ఆధీనంలోనే ఉంచాలని కూడా ఆదేశించారు.