పనాజీ: వాళ్లిద్దరు చుట్టాలు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజును ఓ మధుర స్మృతిగా మలుచుకుందామని అనుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పర్యాటకుల స్వర్గధామమైన గోవాకు వెళ్లారు. మంగళవారం సాయంత్రం పాలోలెమ్ బీచ్కు వెళ్లారు. సరదాగా బీచ్లో జలకాలాడుతూ ప్రమాదవశాత్తూ సముద్రంలో మునిగి చనిపోయారు. ప్రమికుల రోజునే ఈ విషాదం చోటుచేసుకోవడంతో వారికుటుంబాల్లో విషాదం నెలకొన్నది.
ఉత్తరప్రదేశ్కు చెందిన సుప్రియాదూబే (26), విభూశర్మ (27).. ఇద్దరూ రిలేటివ్స్. ఉద్యోగ రీత్యా సుప్రియ బెంగళూరులో ఉంటుండగా, విభూశర్మ ఢిల్లీలో ఉంటున్నాడు. ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14ను ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసుకుందామని అనుకున్నారు. దీంతో గోవా వచ్చారు. సోమవారం రాత్రి పాలోలెం బీచ్లో సరదాగా తిరిగారు. మంగళవారం సాయంత్రం కూడా బీచ్కు వచ్చారు. సముద్ర జలాల్లో సరదాగా జలకాలాడుతున్నారు. ఇంతలో ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇద్దరిని కొంకణ్ హెల్త్కేర్ సెంటర్కు తరలించారు.
అయితే వారు అప్పటికే మరణించారని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కాగా, వారిద్దరు వెకేషన్ నిమిత్తం గోవా వచ్చారని తెలిపారు. వాళ్లిద్దరు చుట్టాలేనని, వారు గోవా వచ్చినట్లు ఇరు కుటుంబాలవారికి తెలియదని చెప్పారు. గత రెండు రోజులుగా వారు బీచ్లో తిరగడం స్థానికులు చూశారన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.