న్యూఢిల్లీ: పెళ్లి చేసుకుని నాలుగేళ్లే కలిసి ఉంది ఓ జంట. ఆ తర్వాత 25 ఏళ్లు దూరంగా ఉన్నారు. తాజాగా ఆ జంట విడాకులు కోరుతూ సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. ఆ కేసులో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిస్తూ ఆ మ్యారేజీని రద్దు చేసింది. ఆ జంటను ఒక్కటి చేయడం అంటే, అది వాళ్లకు క్రూరత్వాన్ని ప్రసాదించడమే అవుతుందని కోర్టు తన తీర్పులో అభిప్రాయపడింది.
జస్టిస్ సుధాన్షు దులియా, జేబీ పర్దివాలాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పును వెలువరించింది. దూరంగా ఉంటున్న ఆ జంట మధ్య ఉన్న బంధం.. హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే అని కోర్టు చెప్పింది. ఆ జంటకు పిల్లలు లేరని, వారి వైవాహిక బంధం బ్రేకైందని, దాన్ని రిపేర్ కూడా చేయలేమని కోర్టు పేర్కొన్నది.
ఆ ఇద్దరి మధ్య బంధం ముగిసిపోవాలని, ఎందుకుంటే వాళ్లను కలిపి ఉంచడం క్రూరత్వం అవుతుందని, సుదీర్ఘ కాలంగా దూరంగా ఉండడం, కలిసి జీవించకపోవడం, అర్థవంతమైన బంధాలను తెంచుకుని జీవించే వాళ్లను హిందూ వివాహ చట్టం ప్రకారం కలిపి ఉంచలేమని కోర్టు తెలిపింది.
ఆ జంటకు పిల్లలు లేరు కాబట్టి, వారిని విడదీయడం కేవలం వాళ్లకు మాత్రమే నష్టాన్ని మిగుల్చుతుందని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. భర్త నెలకు లక్షా ఆర్జిస్తున్నాడని, అయితే ఈ కేసులో భార్యకు నాలుగు నెలల్లోగా 30 లక్షలు చెల్లించాలని కోర్టు తన తీర్పులో ఆదేశించింది.
1994లో ఆ జంట ఢిల్లీలో పెళ్లి చేసుకున్నది. అయితే తనకు చెప్పకుండా ఆమె అబార్షన్ చేయించుకున్నట్లు గతంలో భర్త ఆరోపించాడు. నాలుగేళ్ల తర్వాత ఇంటిని వదిలేసిన ఆ మహిళ.. గృహ హింస చట్టం కింద భర్తపై కేసు నమోదు చేసింది. ఆ తర్వాత భర్తను, అతని సోదరున్ని పోలీసులు అరెస్టు చేశారు.
బెయిల్పై వాళ్లు రిలీజయ్యారు. ఆ తర్వాత భర్త విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రయల్ కోర్టు డైవర్స్ మంజూరీ చేసినా.. ఢిల్లీ హైకోర్టు దాన్ని వ్యతిరేకించింది. దీంతో అతను మళ్లీ సుప్రీంకోర్టు సవాల్ చేశారు.