Murder | ఓ యువతి తన ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించిందని ఆమెను తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముజఫర్నగర్కు చెందిన ఓ 19 ఏండ్ల యువతి గతేడాది అక్టోబర్ నెలలో తన ప్రియుడితో కలిసి బయటకు వెళ్లిపోయింది. అనంతరం ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అదే ఏడాది డిసెంబర్లో ఆ జంట ఆచూకీ లభించింది. దీంతో యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
కాగా యువతి 8 నెలల గర్భిణి. ఈ కేసులో యువతి వాంగ్మూలాన్ని శనివారం కోర్టులో నమోదు చేయాల్సి ఉండే. కానీ ఆమె కోర్టుకు హాజరు కాలేదు. దీంతో పోలీసులు ఆరా తీయగా.. ఆ యువతిని తల్లిదండ్రులే హత్య చేసి కాలువలో పడేసినట్లు తేలింది. ఎందుకంటే.. ప్రియుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు నిరాకరించిందనే కారణంగానే కూతురిని చంపినట్లు తల్లిదండ్రులు అంగీకరించారు. ఈ ఘటనలో తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. యువతి ప్రియుడు కూడా ప్రస్తుతం జైల్లోనే ఉన్నాడు.