భోపాల్: పెళ్లిలో వధూవరులు విషం తాగారు (Consuming Poison At Wedding). పెళ్లికొడుకు మరణించగా, పెళ్లికుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నది. ఆమె ప్రాణాలతో పోరాడుతున్నది. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ సంఘటన జరిగింది. కనాడియా ప్రాంతంలోని ఆర్యసమాజ్ ఆలయంలో 21 ఏళ్ల యువకుడికి 20 ఏళ్ల యువతితో మంగళవారం పెళ్లి జరుగుతున్నది. అయితే వివాహం సందర్భంగా వధూవరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో తొలుత పెళ్లికుమారుడు విషం తాగాడు. పెళ్లికుమార్తెకు ఈ సంగతి చెప్పాడు. దీంతో ఆమె కూడా విషం తాగింది. గమనించిన బంధువులు వెంటనే వారిద్దరినీ స్థానిక హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే వరుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వధువు పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు వెల్లడించారు.
కాగా, తనను పెళ్లి చేసుకోవాలని పెళ్లికుమార్తె గత కొన్ని రోజులుగా ఒత్తిడి చేస్తున్నదని పెళ్లికుమారుడి కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నానని, రెండేళ్లు ఆగమని అతడు చెప్పగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరికీ పెళ్లి జరుగుతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరోవైపు ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.