Family Suicide | జైపూర్ : దంపతులతో పాటు ఓ ముగ్గురు పిల్లలు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లోని బికనేర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. ముక్తప్రసాద్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంత్యోదయ నగర్లో హనుమాన్ సోని(45) తన భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అయితే ఆ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా, ఐదుగురు ఉరేసుకున్నారు. మృతదేహాలను కిందకు దించిన పోలీసులు.. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పీబీఎం హాస్పిటల్కు తరలించారు.
మృతులను హనుమాన్ సోని, భార్య విమల(40), కుమారులు మోహిత్(18), రిషి(16), కూతురు గుడియా(14)గా పోలీసులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులందరూ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.