భువనేశ్వర్: దేశంలో రెండో ఒమిక్రాన్ మరణం నమోదైంది. ఒడిశాలోని సంబల్పూర్ జిల్లాలో ఇది వెలుగులోకి వచ్చింది. అగల్పూర్ గ్రామానికి చెందిన 55 ఏండ్ల మహిళ, బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (విమ్సార్)లో కరోనాతో చికిత్స పొందుతూ డిసెంబర్ 27న చనిపోయింది. ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్కు పంపగా ఒమిక్రాన్గా నిర్ధారణ అయినట్లు బలంగీర్ జిల్లా వైద్య అధికారులు గురువారం అధికారికంగా ప్రకటించారు.
ఎలాంటి విదేశీ ప్రయాణ చరిత్ర లేని ఆమెకు డిసెంబర్ 20న గుండెపోటు వచ్చిందని బలంగీర్ చీఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ స్నేహలతా సాహు తెలిపారు. బలంగీర్లోని భీమా భోయ్ వైద్య కళాశాల ఆసుపత్రిలో రెండు రోజుల చికిత్స అనంతరం బుర్లాలోని విమ్సార్కు రిఫర్ చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 22న అక్కడ అడ్మిట్ అయిన సందర్భంగా కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా మరునాడు తేలిందన్నారు. దీంతో ఆమె నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ టెస్ట్కు ఒమిక్రాన్గా నిర్ధారణ అయినట్లు స్నేహలతా సాహు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో డిసెంబర్ 27న మరణించినట్లు వెల్లడించారు.
మరోవైపు ఒడిశాలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదు కావడంతో ఆ రాష్ట్ర వైద్య అధికారులు, ప్రత్యేకించి సంబల్పూర్ జిల్లా అధికారులు అలెర్ట్ అయ్యారు. ఒమిక్రాన్తో మరణించిన మహిళను కాంటాక్ట్ అయిన వారికి కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. కాగా, దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్థాన్లో నమోదైంది. ఉదయ్పూర్కు చెందిన 72 ఏండ్ల వ్యక్తి సాంకేతికంగా ఒమిక్రాన్ వల్ల చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం పేర్కొంది.