న్యూఢిల్లీ: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ పతనానికి కౌంట్డౌన్ మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు. ఇవాళ ఛత్తీస్గఢ్లో ప్రారంభమైన 85వ ప్లీనరీ సెషన్ అనంతరం కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని పైలట్ ధీమా వ్యక్తం చేశారు. ఈ ప్లీనరీతోనే ఎన్డీఏ సర్కారుకు కౌంట్డౌన్ మొదలైనట్లని ఆయన చెప్పారు.
‘ఈ ప్లీనరీతో కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ ఒక కొత్త సందేశం అందనుంది. ప్లీనరీ సందర్భంగా పలు కీలక తీర్మానాలు చేయనున్నారు. ఈ తీర్మానాలతోనే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం 2024 ఎన్నికల్లో ఓటమి పాలయ్యేందుకు కౌంట్ డౌన్ మొదలుకానుంది. ప్లీనరీ ముగిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కానుంది’ అని సచిన్ పైలట్ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ ప్రారంభానికి ముందు సచిన్ పైలట్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థిగా రాహుల్గాంధీయే బరిలో దిగుతారా..? అన్న ప్రశ్నకు.. ప్లీనరీలో తీర్మానాల అనంతరం అన్ని విషయాలు వెల్లడవుతాయని చెప్పారు.
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లోని నవా రాయ్పూర్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ ఇవాళ ప్రారంభమైంది. కాగా, తాజా ప్లీనరీ సెషన్ ఎజెండాను ఖరారు చేయడానికి ఇవాళ ఉదయం కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశమైంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎన్నికల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. సీడబ్ల్యూసీ ఎన్నికలు నిర్వహించాలా వద్దా అనే దానిపై కమిటీ ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.