న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా శనివారం పదవీ విరమణ చేసిన జస్టిస్ హృషికేష్ రాయ్ (Justice Hrishikesh Roy) కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొనడంపై చెలరేగిన వివాదం గురించి మీడియాతో మాట్లాడారు. వారిద్దరూ అలా కలుసుకోవడాన్ని నివారించవచ్చని తెలిపారు. ‘ఈ సంఘటన ప్రధాన న్యాయమూర్తి వ్యక్తిగత కార్యక్రమం. వాస్తవానికి ఈ దృశ్యాలు కొంత కలవరపెట్టేలా కనిపించాయి. కానీ గతాన్ని పరిశీలిస్తే, దానిని నివారించవచ్చని నేను నమ్ముతున్నా’ అని అన్నారు.
కాగా, ఒకవేళ మీడియా కవరేజ్ లేకుండా ఈ సమావేశం ప్రైవేట్గా జరిగి ఉంటే ఆందోళనలను రేకెత్తించకపోవచ్చని జస్టిస్ హృషికేష్ రాయ్ అభిప్రాయపడ్డారు. ‘ఈ కార్యక్రమం పూజాగది నుంచి ప్రజల దృష్టికి వెళ్లి అనవసరమైన ఊహాగానాలను సృష్టించే సమస్యకు దారి తీసింది’ అని అన్నారు. అయితే ఆ ఇద్దరిలో ఎవరూ కోర్టుకు సంబంధించిన ఎలాంటి విషయాలను చర్చించలేదని, న్యాయమూర్తి నిర్ణయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నం జరుగలేదని తాను నమ్ముతున్నట్లు చెప్పారు.
‘జస్టిస్ చంద్రచూడ్ పూర్తిగా నిజాయితీపరుడు. దానిని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు. ఆ సమావేశంలో కోర్టుకు సంబంధించిన ఏదైనా విషయాన్ని ప్రధానమంత్రితో చర్చించడానికి ఆయనకు ఎటువంటి సందర్భం ఉండేది కాదని నేను గట్టిగా నమ్ముతున్నా’ అని జస్టిస్ రాయ్ అన్నారు. అలాగే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి శేఖర్ కుమార్ యాదవ్ వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. మెజారిటీ ప్రజల కోరికల ప్రకారం దేశం పనిచేస్తుందని చెప్పారు.