Captain Amarinder Singh | పంజాబ్ సీఎంగా రాజీనామా చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరిందర్ సింగ్కు పార్టీ అధిష్ఠానం పట్ల వైఖరి మారిందా.. హస్తం పార్టీకి గుడ్బై చెప్పనున్నారా.. వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయా.. అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో అమరిందర్ సింగ్కు ప్రత్యర్థిగా ఉన్న పంజాబ్ పీసీసీ అధ్యక్షుడిగా నవ్జ్యోత్ సింగ్ సిద్ధూను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించినప్పటి నుంచి వారిద్దరి మధ్య దూరం పెరిగింది.
తన పట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అవమానకర తీరును భరించలేకపోతున్నట్లు కెప్టెన్ అమరిందర్ సింగ్ చెప్పారు. సీఎంగా వైదొలిగిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. తనపట్ల కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ విశ్వాసం తగ్గినట్లు ఉందన్నారు. సీఎంగా వైదొలిగిన తర్వాత తన భవిష్యత్ కార్యాచరణపై అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో ఎన్నికల ముందు బీజేపీలో చేరతారా? అన్న వదంతులు వినిపిస్తున్నాయి.
కెప్టెన్ అమరిందర్ సింగ్ ఎల్లవేళలా పార్టీ అధిష్ఠానం జారీ చేసిన ఆదేశాలకు తలొంచుకుని ఆమోదం తెలిపే వారు కాదన్న విమర్శలు ఉన్నాయి. ఖలిస్థాన్ ఉగ్రవాదులను ఏరివేయడానికి 1984లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ.. ఆపరేషన్ బ్లూస్టార్ జరిపిన తర్వాత కెప్టెన్ అమరిందర్ సింగ్ పార్టీని వీడారు. తిరిగి పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న తర్వాతే హస్తం గూటికి చేరుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కెప్టెన్ వల్లే పంజాబ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన వల్లే ఓటమి పాలయ్యే సంకేతాలే కనిపిస్తున్నాయి.
పంజాబ్లోని 38.5 శాతం మంది హిందువుల ఓట్లను తమ ఖాతాలో కలిపేసుకోవాలని తలపోస్తున్నది బీజేపీ. మొత్తం జనాభాలో దళితులు 31 శాతం. జాట్ సిక్కులు 21 శాతం. కెప్టెన్ అమరిందర్ సింగ్ జాట్ సిక్కు సామాజిక వర్గ నేత. ఆయనను తమ పార్టీలోకి ఆహ్వానిస్తే పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకోవచ్చునని కమలనాథులు భావిస్తున్నారు. జాట్ సిక్కులతోపాటు రైతుల్లోనూ అమరిందర్ సింగ్కు ఉన్న పట్టును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రాజధాని శివారుల్లో ఆందోళన కొనసాగిస్తున్న రైతులు, రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరుపాలని ప్రధాని మోదీకి అమరిందర్ సింగ్.. సీఎం హోదాలో లేఖ రాయడం గమనార్హం.