బెంగళూరు, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వ అవినీతి బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే ‘40% కమీషన్’ సర్కార్ అంటూ సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తుండగా.. తాజాగా బీజేపీ ప్రభుత్వ అవినీతి పర్వాన్ని సాక్షాత్తూ బొమ్మై క్యాబినెట్లోని మంత్రే బహిరంగంగా వెల్లడించారు. ఇటీవల సస్పెన్షన్కు గురై గురువారం గుండెపోటుతో మృతి చెందిన పోలీసు ఇన్స్పెక్టర్ హెచ్ఎన్ నందీశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా మంత్రి ఎంటీబీ నాగరాజు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కర్ణాటకలో సంచలనంగా మారాయి. ‘ఇన్స్పెక్టర్ పోస్టింగ్కు రూ.70-80 లక్షల లంచం ఇస్తే గుండెపోటు రాకుండా ఇంకేమవుతుంది’ అని నాగరాజు వ్యాఖ్యానించిన వీడియో వైరల్గా మారింది.
దీన్ని మించిన సాక్ష్యం ఏంటి?
మంత్రి నాగరాజు చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు స్పందించాయి. బీజేపీ ప్రభుత్వ బహిరంగ అవినీతికి ఇంతకు మించిన సాక్ష్యం ఏముంది? అని జేడీఎస్ అధినేత, మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి పేర్కొన్నారు. అవినీతిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ‘ఇప్పుడు ప్రభుత్వమే నిజం చెప్పింది. బొమ్మై మంత్రివర్గంలోని ఆయన సహచరుడే ఈ చేదు నిజాన్ని బహిర్గతం చేసారు. మంత్రి నాగరాజు ప్రకటన ప్రభుత్వం లంచాలు తీసుకుని ఉద్యోగ నియామకాలు చేస్తున్నదనేందుకు నిదర్శనం‘ అని కుమారస్వామి పేర్కొన్నారు. నందీశ్ మృతిపై విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్ డిమాండ్ చేశారు.
సీఎం గారూ నిజం చెప్పండి!
జేడీఎస్ నేత కుమారస్వామి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా పలు సూటి ప్రశ్నలు సంధించారు. మంత్రి చెప్పినట్టు రూ.70-80 లక్షల ముడుపు ఎవరికి చెల్లించారు? ముఖ్యమంత్రి, హోంమంత్రి, ఉన్నతాధికారుల వాటాలు ఎంతెంత?’ అని ప్రశ్నించారు. ఈ కుంభకోణం వెనుక కనిపించని రిమోట్ ఏదైనా ఉందా? అని అనుమానం వ్యక్తం చేశారు. ‘మంత్రిలాగా మీరు కూడా నిజం చెప్పండి సీఎం గారు’ అని కుమారస్వామి ట్వీట్ చేసారు. మంత్రి నాగరాజు చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి జ్ఞానేంద్ర బదులివ్వాలని డిమాండ్ చేశారు.
అసలు ఏం జరిగిందంటే..
బెంగళూరు నగరంలోని కృష్ణరాజపురం పోలీసుస్టేషన్లో హెచ్ఎన్ నందీశ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. పోలీసుస్టేషన్ పరిధిలో ఓ బార్ అండ్ రెస్టారెంట్ అర్ధరాత్రి దాటిన తర్వాత తెరిచి ఉంచినా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పోలీసు కమిషనర్ ప్రతాపరెడ్డి 10 రోజుల క్రితం నందీశ్ను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్కు గురైన నందీశ్ గురువారం గుండెపోటుతో మృతిచెందారు. ఆయన అంతిమ సంస్కారాలకు వెళ్లిన మంత్రి నాగరాజు ప్రభుత్వ పోస్టింగుల్లో లంచాల గురించి పై వ్యాఖ్యలు చేశారు.