ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోవెల్లువలా పాల ఉత్పత్తి, సేకరణ
పాడి పరిశ్రమలకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహం
పాడి ప్రగతికి రూ.18 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్
ఆదిలాబాద్లో విజయ డెయిరీపాల శీతలీకరణ కేంద్రం ఆధునీకరణ
రేపు ప్రారంభించనున్నమంత్రులు తలసాని, ఇంద్రకరణ్రెడ్డి
ఆదిలాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ సర్కారు పాడి పరిశ్రమను ప్రగతి పథంలో నడిపించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నది. సాగు కు అనుబంధ రంగంగా ఉండడంతో రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించి ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురికాగా.. నాలుగేండ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్(టీఎస్డీసీసీ)గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనూహ్య మార్పులు వచ్చాయి. విజయ డెయిరీ ఆధీనంలోని పాలశీతలీకరణ కేంద్రాలను ఆధునీకరించి పాలను కొనుగోలు చేసే రైతులకు సరైన ధర వచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పాడి పరిశ్రమాభివృద్ధికి సీఎం రూ.18 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ఇప్పటికే నిర్మల్, లక్షెట్టిపేటలలో పాలశీతలీకరణ కేంద్రాలను ఆధునీకరించగా.. లక్షెట్టిపేటలో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్లో ఆధునీకరించిన 20 వేల లీటర్ల పాల సామర్థ్యం గల పాలశీతలీకరణ కేంద్రాన్ని రూ.5.6 కోట్లతో ఆధునీకరించారు. ఈ కేంద్రం లో పాల శుద్ధీకరణ, ప్యాకెట్ల తయారీ, పెరుగు, ఇతర పదార్థాలను తయారు చేస్తారు. మంగళవారం రాష్ట్ర పాడి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, అటవీ పర్యావరణ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆదిలాబాద్లోని పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు.
పెరుగనున్న పాల సేకరణ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అధిక పాల సేకరణ కోసం విజయ డెయిరీ ఆధ్వర్యంలో కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం రోజు నాలుగు వేల లీటర్ల పాలను సేకరిస్తున్నారు. పాల ధరను వెన్న శాతం ఆధారంగా చెల్లిస్తారు. ఆదిలాబాద్లో 16, నిర్మల్లో 17, భైంసాలో 24, లక్షెట్టిపేటలో 14 కేంద్రాల నుంచి పాలను సేకరిస్తున్నారు. ఈ కేంద్రాలను విస్తరించనున్నట్లు అధికారులు తెలిపారు.
పలు రకాల ప్రోత్సాహకాలు
విజయ డెయిరీకి పాలు విక్రయించిన రైతులకు ప్రభుత్వం లీటర్కు రూ.4 చొప్పున బోనస్ రూపంలో చెల్లిస్తున్నది. పశువుల కొనుగోలు చేసే రైతులకు సబ్సిడీ ఇస్తున్నది. పశువుల కొనుగోలుకు రూ.10 వేలు, బీమాకు రూ. 1000, మేతకు రూ. 200 అందజేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పశువుల కోసం షెడ్లు నిర్మించి, పశుగ్రాసం విత్తనాలను సబ్సిడీపై ఇస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా రూ.2.25 లక్షల విలువ గల ఈ కార్ట్ వాహనాలకు రూ.67,500 సబ్సిడీని విజయ డెయిరీ నుంచి మంజూరు చేస్తున్నారు. లబ్ధిదారులు రూ.1.57 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తులను విక్రయించడానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పార్లర్లను ఏర్పాటు చేస్తున్నారు. సబ్సిడీపై 1,390 మంది రైతులకు పాడి పశువులను పంపిణీ చేశారు. ఐటీడీఏ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంలో భాగంగా నేరడిగొండ, ఇంద్రవెల్లి, జైనూర్లో డెయిరీ పార్లర్లను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వసతి గృహా ల్లో చదువుకుంటున్న విద్యార్థులకు విజయ డెయిరీ పాలను సరఫరా చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఈ పొడితో నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు తెలుసా?
కేవోఎల్ డైరెక్టర్ ఆస్తులు జప్తు