న్యూఢిల్లీ, మార్చి 25: దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,590 కొవిడ్ కేసులు వెలుగు చూశాయని, ఆరుగురు మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శనివారం ఉదయం ప్రకటించింది. 146 రోజుల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య ఇదే అత్యధికమని తెలిపింది. దీంతో దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 8,601కి పెరిగింది. మరోవైపు ఇన్ఫ్లూయెంజా వ్యాప్తి కూడా భయపెడుతున్నది.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం.. ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దవాఖానల సంసిద్ధతను సమీక్షించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 11 తేదీల్లో దేశవ్యాప్తంగా కొవిడ్ మాక్డ్రిల్స్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ సంయుక్తంగా అన్ని రాష్ర్టాలు, యూటీలకు మార్గదర్శకాలు జారీచేశాయి. వైద్య సామగ్రి, ఆక్సిజన్, ఔషధాల లభ్యతను అంచనా వేసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో డ్రిల్స్ చేపట్టాలని పేర్కొన్నాయి.