తిరువనంతపురం: కేరళలో కరోనా ( Corona virus ) మహమ్మారి ప్రభావం ఇంకా తగ్గలేదు. అక్కడ రోజూ 20 వేల దరిదాపుల్లోనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా కేరళలో 19,451 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇవాళ కరోనా రికవరీల సంఖ్య దాదాపు పాజిటివ్ కేసుల సంఖ్యకు దరిదాపుల్లోనే ఉన్నది. ఇవాళ 19,104 మంది కరోనా బాధితులు ఆ వైరస్ బారి నుంచి కోలుకున్నారు.
ఇక కరోనా మరణాలు కూడా కేరళలో భారీగానే నమోదవుతున్నాయి. ఇవాళ కూడా 105 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 18,499కి చేరింది. ఇదిలావుంటే కేరళలో ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులలో రికవరీలు, మరణాలు పోను మరో 1,80,240 యాక్టివ్ కేసులు ఉన్నాయి.