న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) మరో మైళురాయిని అందుకున్నది. ఇప్పటివరకు 15 ఏండ్లు ఆ పై వయస్కులకు టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగతున్నది. తాజాగా 12-14 ఏండ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.
2010 లేదా అంతకన్నా ముందు జన్మించి 12 ఏండ్లు పూర్తిచేసుకున్నవాళ్లు టీకా తీసుకోవడానికి అర్హులని, వీరంతా వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్లో పేరును నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఒకవేళ 12 ఏండ్లు నిండకపోతే పేరు నమోదు చేసుకున్నా టీకా ఇచ్చేదిలేదని స్పష్టం చేసింది. కొవిన్ పోర్టల్లో పేరు నమోదు చేసుకొని ఇప్పటికే టీకా తీసుకున్న తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్ (స్లాట్) ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు. అలాగే టీకా కేంద్రానికి వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏండ్ల వయస్సు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల ఢిల్లీకి చెందిన 13 ఏండ్ల చిన్నారి భవ్యా సంతోషం వ్యక్తంచేసింది. టీకాల పట్ల తనకు ఎలాంటి అనుమానాలు లేవని చెప్పింది. ఇప్పటికే తన తల్లిదండ్రులు వ్యాక్సిన్ తీసుకున్నారని, వారిలానే తనకూ మంచే జరుగుతుందని వెల్లడించింది. కార్బోవ్యాక్స్ తీసుకున్నానని, ప్రస్తుతం తనకు ఇలాంటి సమస్యా లేదని తెలిపింది. అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రియా అనే విద్యార్థిని సూచించింది.