హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): విచ్చలవిడితనానికి హాట్స్పాట్లు ఏవైనా ఉన్నాయంటే.. అవి పబ్బులే. ఇప్పుడు కరోనా గబ్బుకు కూడా అవే కేంద్రస్థానాలుగా మారిపోయాయి. రాత్రి కాగానే తలుపులు తెరుచుకొనే పబ్బులు ముందుగా ఆహ్వానిస్తున్నవి కరోనానే. తమ దగ్గరినుంచి కరోనా కార్చిచ్చును రగిలిస్తున్నాయి. పబ్లకు వెళ్లే యువత.. తమనుంచి తమ కుటుంబ సభ్యులకు.. వారి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నారు. తాము అన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నామని పబ్ నిర్వాహకులు చెప్తున్నా ఎక్కడా ఆ ఛాయలు కనిపించడంలేదు. పబ్ లోపలికి ప్రవేశించేముందు మాత్రమే మాస్క్ ధరిస్తున్న కస్టమర్లు లోపల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భౌతికదూరం అన్నమాటే లేకుండా పోయింది. హైదరాబాద్లో వంద వరకు పబ్బులు నడుస్తున్నాయి. హైదరాబాద్లో 52, మిగతావి సైబరాబాద్, రాచకొండలో ఉన్నాయి. వీటిలోకి ప్రతి నిత్యం వచ్చిపోయే వారి సంఖ్య కనీసం 8 నుంచి 10 వేల వరకు ఉంటుంది. గతంలో కేవలం బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలకే పరిమితమైన పబ్బులు.. నేడు మలక్పేట్, ఎల్బీనగర్, ఉప్పల్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో కూడా వెలిశాయి. ఈ పబ్బులకు నగరం నలుమూలల నుంచి యువత వచ్చిపోతుంటారు. పబ్బుల్లోకి వచ్చేటప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఇతరులతో కలిసి మద్యం, సిగరెట్లు తాగడం, కలిసి డ్యాన్స్లు వేయడం పరిపాటి. ఆ డ్యాన్స్ల్లో కొన్ని సందర్భాలలో శృతిమించి ముద్దులవరకు వెళ్తుంటాయి. ఆహారపదార్ధాలు సరఫరాచేసేవారు కూడా ప్లేట్లలో సర్వ్ చేస్తుంటారు. వీటితో పాటు చల్లటీ ఏసీలలో చెమటలు కారేలా డ్యాన్స్లు వేస్తూ.. మరో పక్క కిక్కు ఎక్కేందుకు పెగ్గులు వేస్తుంటారు. మత్తులో ఒకరు తాగిన గ్లాస్లో మరొకరు తాగడం.. ఒకరు తాగిన సిగరెట్ను మరొకరు షేర్ చేసుకుంటారు కూడా. కొవిడ్ అనేది ఏసీలు ఉండటం వల్ల విస్తరించేందుకు అవకాశాలుంటాయి.
కరోనా విస్తరిస్తుండటంతో ప్రభుత్వం ప్రజలు క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మాస్క్లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజల్లో ఎంతో అవగాహన కల్పిస్తున్నది. ప్రధానమైన రెండు విషయాలను పబ్బులు పక్కనపెడుతున్నాయి. పోలీసులు కూడా రాత్రి నిర్ణీత సమయంలో పబ్బు మూసేశారా? లేదా? అనే విషయాన్ని మాత్రమే పరిశీలిస్తున్నారని, లోపల ఏం జరుగుతున్నదో పరిగణనలోకి తీసుకోవడంలేదని విమర్శలున్నాయి. పిల్లలు పబ్బులకు వెళ్తుండటంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలయ్యింది. పబ్బుల నుంచి బయటకు వచ్చిన వారి వద్దకు ఆటోలు, క్యాబ్ల డ్రైవర్లు కూడా వెళ్లాలంటే భయపడుతున్నారు. సాధారణంగా రాత్రి 11 గంటలు దాటిందంటే పబ్బుల నుంచి చాలామంది క్యాబ్ డ్రైవర్లకు గిరాకీ ఉంటుంది. తాజాగా కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో గతంలో ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు.