న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో కరోనా సెకండ్వేవ్ ఇంకా ముగిసిపోలేదని, ఎనిమిది రాష్ర్టాల్లో వైరస్ వ్యాప్తి రేటును తెలియజేసే ‘ఆర్-ఫ్యాక్టర్’ (రీ ప్రొడక్టివ్ రేటు) ఒకటి కంటే ఎక్కువగా ఉన్నదని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఆర్’ ఫ్యాక్టర్ 0.6 కంటే తక్కువగా ఉండాలని సూచించింది. ఒకవేళ ‘ఆర్’ విలువ 1 దాటితే మహమ్మారి విశృంఖలంగా వ్యాపిస్తున్నట్టు అర్థం చేసుకోవాలని హెచ్చరించింది. ఈ మేరకు దేశంలో కరోనా పరిస్థితులపై మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అధికారులు మాట్లాడారు. ‘దేశంలో ఇంకా కరోనా తీవ్రత కొనసాగుతున్నది. డెల్టా వేరియంట్ కారణంగా ఉద్ధృతమైన సెకండ్వేవ్ ఇంకా ముగిసిపోలేదు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్, లక్షద్వీప్, తమిళనాడు, మిజోరం, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ వంటి 8 రాష్ర్టాల్లో ‘ఆర్’ విలువ 1 కంటే ఎక్కువగా ఉన్నది. ఇది ఆందోళన కలిగించే అంశం’ అని కొవిడ్-19పై ప్రభుత్వం ఏర్పాటుచేసిన కార్యదళం అధ్యక్షుడు వీకే పాల్ అన్నారు. దేశంలోని 44 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నదన్నారు. 18 జిల్లాల్లో కేసులు సంఖ్య భారీగా పెరుగుతున్నని చెప్పారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ర్టాల్లోనే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నదని పేర్కొన్నారు. బెంగాల్, నాగాలాండ్, హర్యానా, గోవా, ఢిల్లీ, జార్ఖండ్లో ‘ఆర్’ విలువ 1గా ఉన్నట్టు వెల్లడించారు. గతవారం నమోదైన మొత్తం కేసుల్లో 49.85 శాతం కేసులు ఒక్క కేరళలోనే నమోదైనట్టు వివరించారు.
దేశంలో ఇప్పటివరకూ 47.85 కోట్ల వ్యాక్సిన్ డోసులను వేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 37.26 కోట్లు మొదటి డోసులు కాగా, 10.59 కోట్లు రెండో డోసు అని తెలిపింది.
‘ఆర్’ విలువ 1 కంటే ఎక్కువగా ఉంటే కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు అర్థంచేసుకోవాలని, ఇలాంటి పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించాల్సిన అవసరమున్నదని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, భారత్లో ఆర్ విలువ సగటున 1.2గా ఉన్నట్టు పేర్కొన్నారు. దీన్నిబట్టి వ్యాధిసోకిన ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువమందికి వైరస్ను సోకేలా చేస్తున్నట్టు అర్థంచేసుకోవాలన్నారు. కాగా వైరస్ వ్యాప్తి రేటును తెలియజేసేందుకు ‘ఆర్-ఫ్యాక్టర్’ సాయపడుతుంది. ‘ఆర్’ విలువ 2గా ఉంటే వైరస్ రోగి నుంచి మరో ఇద్దరికి మహమ్మారి సోకినట్టు అర్థం.