దేశరాజధాని ఢిల్లీలోని జైళ్లలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం చూపుతోంది. నగరంలోని మూడు ప్రధాన జైళ్లలోనే ఇటీవలి కాలంలో 187 కరోనా కేసులు నమోదయ్యాయి. తీహార్, రోహిణి, మండోలి జైళ్లలో సుమారు 99 మంది ఖైదీలు, 88 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ తేలింది. ఈ కేసులన్నీ కూడా గత డిసెంబరు నుంచి జనవరి 15 మధ్యనే నమోదైనట్లు జైళ్ల శాఖ అధికారికంగా వెల్లడించింది.
అయితే వీటిలో ఏ కరోనా కేసు కూడా తీవ్రమైనది కాదని, సదరు జైళ్లలో ఉన్న వైద్యులు కరోనా సోకిన వారికి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఢిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్ వివరించారు. కాగా, దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా వ్యాపిస్తున్నాయి.
మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా 2.5 లక్షలపైగా కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ మహమ్మారిని నిలువరించేందుకు పలురాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, వీకెండ్ కర్ఫ్యూలు వంటి ఆంక్షలు విధిస్తున్నాయి.