న్యూఢిల్లీ, మార్చి 24: కరోనా బారినపడ్డవారు ఇప్పటికే దీర్ఘకాల కొవిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కొవిడ్-19తో మనుషుల జన్యు నిర్మాణంలోనూ మార్పులు చోటుచేసుకొన్నాయని తాజా అధ్యయనం అంచనావేసింది. మన కణాలలోని జన్యు పదార్థాలు క్రొమాటిన్ నిర్మాణంలో నిల్వ ఉంటాయి. కొన్ని రకాల వైరస్లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఈ క్రొమాటిన్ను హైజాక్ చేస్తాయి.
తద్వారా అవి మన కణాల్లో విజయవంతంగా పునరుత్పత్తి చేస్తాయి. కరోనా పాజిటివ్ రోగుల్లో ఈ క్రొమాటిన్ ఆకృతి కోల్పోయినట్టు తాము గుర్తించామని యూఎస్లోని టెక్సాస్ వర్సిటీ ప్రొఫెసర్ వెన్బో లీ తెలిపారు. ఇది సైటోకిన్ తుఫాన్కు కారణమై కొంతమంది కరోనా రోగులు అకస్మాత్తుగా మరణించారని గుర్తించినట్టు చెప్పారు. అయితే, కరోనా వైరస్ అనేది క్రొమాటిన్ను ఎంతమేర ప్రభావితం చేసిందనేదానిపై మాత్రం ఇంకా స్పష్టత లేదని వెల్లడించారు.