న్యూఢిల్లీ: కోవిడ్పై పోరాటంలో భాగంగా ఇండియాలో మరో కొత్త వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అమనుతి ఇచ్చింది. కోర్బీవ్యాక్స్, కోవోవ్యాక్స్ టీకాలకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవాళ ఆయన తన ట్విట్టర్లో ఈ విషయాన్ని చెప్పారు. రెండు వ్యాక్సిన్లతో పాటు యాంటీ వైరల్ డ్రగ్ మోల్నూపిరావిర్ మందుకు కూడా అనుమతి ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన దేశ ప్రజలకు కంగ్రాట్స్ తెలిపారు. ఒకే రోజు మూడింటికి అనుమతి ఇచ్చినట్లు మంత్రి మాండవీయ తన ట్విట్టర్లో చెప్పారు. కరోనాపై పోరాటంలో భాగంగా ఇప్పటికే ఇండియా పలు వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కోవాగ్జిన్, కోవీషీల్డ్తో పాటు స్పుత్నిక్ టీకాలను ఇండియాలో ఇస్తున్నారు. వీటితో తోడు ఇప్పుడు మరో రెండు వ్యాక్సిన్లు మార్కెట్లోకి వచ్చాయి.
వ్యాక్సిన్ హ్యాట్రిక్..
హైదరాబాద్కు చెందిన బయోలాజికల్ ఈ సంస్థ కోర్బీవ్యాక్స్ టీకాను రూపొందించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ వ్యాక్సిన్ను డెవలప్ చేశారు. ఆర్బీడీ ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్గా దీన్ని అభివృద్ధి చేసినట్లు మంత్రి తన ట్వీట్లో చెప్పారు. ఈ వ్యాక్సిన్తో హ్యాట్రిక్ కొట్టామని, మన దేశం స్వంతంగా డెవలప్ చేసిన మూడవ వ్యాక్సిన్ ఇది అని ఆయన తెలిపారు. ఇక కోవోవ్యాక్స్ టీకాను పూణెకు చెందిన సీరం సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని నానోపార్టికల్ వ్యాక్సిన్గా రూపొందించారు.
మోల్నూపిరావిర్ను యాంటీ వైరల్ డ్రగ్గా వాడనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో ఈ ఔషధం కీలకంగా మారనున్నది. దేశంలోని 13 కంపెనీలు ఈ మందును ఉత్పత్తి చేయనున్నాయి. కోవిడ్19 సోకిన వయోజన రోగులకు మాత్రమే ఈ ఔషధాన్ని ఇవ్వనున్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో మాత్రమే ఈ డ్రగ్ను వాడుతారు. వ్యాధి తీవ్రంగా మారే అవకాశం ఉన్న సందర్భంలో మాత్రమే మోల్నూపిరావిర్ మందును వినియోగించనున్నట్లు మంత్రి మాండవీయ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కోవిడ్పై పోరాటం నిర్విరామంగా సాగుతోందని, కొత్త వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడం వల్ల ప్రపంచవ్యాప్తంగా కోవిడ్పై పోరాటం మరింత బలోపేతం అవుతుందని మంత్రి తెలిపారు.మన దేశ ఫార్మా కంపెనీలు ప్రపంచానికే సంపదగా మారుతున్నట్లు ఆయన తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.