చండీఘఢ్ : పంజాబ్లోని మోగాలో శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) సమావేశ వేదిక దిశగా దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు గురువారం భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రసంగించనున్న ఈ కార్యక్రమానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మోగాలో ఈ కార్యక్రమంలోకి చొచ్చుకువెళ్లేందుకు రైతులు పోలీసులపై రాళ్లు రువ్వి అల్లర్లకు దిగడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టేందుకు భాష్పవాయువు ప్రయోగించారని మోగా ఎస్పీ ధ్రుమన్ నింబలే తెలిపారు.
వేదిక సమీపంలోని జాతీయ హైవేను ఆందోళనకారులు ముట్టడించగా తర్వాత తాము క్లియర్ చేశామని చెప్పారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ తాము దేశ సరిహద్దుల్లో నిరసనలు చేపడుతుంటే రాజకీయ పార్టీలు మొసలి కన్నీరు కారుస్తూ అధికారం కోసం పాకులాడుతున్నాయని రైతులు ఆయా పార్టీలపై భగ్గుమంటున్నారు. మరోవైపు పంజాబ్లోని వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎస్ఏడీ చీఫ్ బాదల్ ఇటీవల చేపట్టిన వంద రోజుల యాత్రపైనా రైతు సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు.