ముంబై : ముంబైలోని అంధేరీ.. అక్కడ ఓ బార్ ఉందన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఆ బార్లో సీక్రెట్ రూమ్ ఉందన్న విషయం మాత్రం ఎవరీకి తెలియదు. అది పేరుకే సీక్రెట్ రూమ్. కానీ అందులో సకల సదూపాయాలతో కూడిన వసతి ఉంది. ఆ గదిలో ఉన్న వారెవరూ ఉక్కపోతకు గురికాకుండా ఏసీ సదుపాయం కూడా కల్పించారు. ఇంతకు ఆ సీక్రెట్ గదిలో ఎవరు ఉంటున్నారు? అంటే.. బార్ గర్ల్స్ అని తేలింది.
అంధేరీలోని దీపా బార్ ఎక్సైజ్ శాఖ నియమ, నిబంధనలు పాటించడం లేదు. అందులో బార్ గర్ల్స్ ఉన్నట్లు ఓ ఎన్జీవో సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ముంబై పోలీసు శాఖకు సంబంధించిన సోషల్ సర్వీస్ బ్రాంచ్ అధికారులు గత శనివారం రాత్రి 11 గంటల నుంచి దీపా బార్లో తనిఖీలు ప్రారంభించారు. బార్లోని బాత్రూమ్లను, స్టోరేజీ రూమ్తో పాటు కిచెన్ను ఇతన గదులను పరిశీలించారు. కానీ ఎక్కడా కూడా బార్ గర్ల్స్ కనబడలేదు. దీంతో అధికారులు వెనక్కి వెళ్లిపోయారు.
మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తనిఖీలు చేపట్టారు. బార్లోని గ్రీన్ రూమ్ పక్కన ఉన్న గ్లాస్ ప్యానెల్ అధికారుల కంటపడింది. ఈ గ్లాస్ ప్యానెల్ అనుమానాస్పదంగా ఉండటంతో దాన్ని పగులగొట్టారు. దాని లోపల ఎలక్ట్రానిక్ డోర్ను కనిపెట్టారు. అది తెరిచి చూడగా.. యువతులు కనబడ్డారు. ఆ సీక్రెట్ గదిలో ఉన్న 17 మంది బార్ గర్ల్స్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఆ రూమ్లో ఉన్న ఆహారం, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ను స్వాధీనం చేసుకున్నారు. దీపా బార్తో పాటు 20 మందిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.