లక్నో: ఉత్తరప్రదేశ్లోని కాస్గంజ్ ( Kasganj ) జిల్లాలో ఉన్న రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దానిని ఆపడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరపడంతో సికందర్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) తీవ్రంగా గాయపడ్డారు. సికిందర్పూర్ (Sikandarpur) పోలీస్ స్టేషన్ పరిధిలో ఎద్దుల విషయమై రెండు సాయుధ గ్రూప్ల మధ్య కాల్పులు జరుగుతున్నాయని సమాచారం అందుకున్న సికందర్ఫూర్ ఎస్హెచ్వో హరిభన్ సింగ్ (SHO Haribhan Singh) తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఓ గ్రూప్ వారిపై కాల్పులు జరిపింది. దీంతో ఎస్హెచ్వో తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలించారని కాస్గంజ్ ఎస్పీ సౌరభ్ దీక్షిత్ (SP Saurabh Dixit ) చెప్పారు. బుల్లెట్ దూసుకెళ్లడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని, మెరుగైన చికిత్స కోసం అలీగఢ్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు తెలిపారు.
కాల్పుల అనంతరం ఓ గ్రూప్ అక్కడి నుంచి పారిపోయిందని, వారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. కాల్పులకు పాల్పడినవారిని తొందర్లోనే అరెస్టు చేస్తామని అదనపు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నదని పేర్కొన్నారు.