జైపూర్: హింసాత్మక ఘటన నేపథ్యంలో మంటలు వ్యాపించిన ఇంట్లో చిక్కుకున్న చిన్నారిని ఒక పోలీస్ కాపాడారు. దీంతో అధికారులతోపాటు నెటిజన్లు ఆయనను ప్రశంసించారు. రాజస్థాన్లోని కరౌలిలో ఈ ఘటన జరిగింది. హిందువుల కొత్త ఏడాది ఆరంభం సందర్భంగా శనివారం ఆ ప్రాంతంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అయితే గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఈ ర్యాలీపై రాళ్లు రువ్వారు. దీంతో హింస రాజుకున్నది. బైక్ ర్యాలీలో పాల్గొన్నవారు ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలోని కొన్ని షాపులు, ఇళ్లకు నిప్పుపెట్టారు.
కాగా, ఊహించని ఈ సంఘటనతో బందోబస్తులో పాల్గొన్న పోలీసులు షాకయ్యారు. పరిస్థితిని అదుపు చేయడంలో కొందరు నిమగ్నమయ్యారు. మరోవైపు రెండు షాపుల మధ్య ఉన్న ఒక ఇంటికి మంటలు వ్యాపించాయి. అందులో ఇద్దరు మహిళలు చిక్కుకున్నారు. ఒక మహిళ చేతిలో చిన్నారి ఉన్నది.
31 ఏళ్ల పోలీస్ కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ దీనిని గమనించారు. వెంటనే మంటలు వ్యాపించిన ఆ ఇంటి వద్దకు వెళ్లారు. అందులోని మహిళలు సహాయం చేయమని ఆయనను కోరారు. దీంతో ఒక మహిళ చేతిలో ఉన్న చిన్నారిని పోలీస్ నేత్రేష్ తన చేతుల్లోకి తీసుకున్నారు. తన వెనకే రావాలంటూ మహిళలకు చెప్పి ఆ చిన్నారిని గుండెలకు హత్తుకుని మంటల్లోంచి బయటకు పరుగుతీశారు. మంటల్లో కాలుతున్న ఆ ఇంటి నుంచి సురక్షితంగా బయటపడిన తర్వాత ఆ చిన్నారిని ఆ మహిళకు అప్పగించారు.
కాగా, పోలీస్ కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ చిన్నారిని రక్షించిన ఘటన మీడియా కంటపడింది. ఒకరు తీసిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లతోపాటు పోలీస్ అధికారులు కూడా కానిస్టేబుల్ నేత్రేష్ శర్మ ధైర్యసాహసాలను అభినందించారు. అయితే తన డ్యూటీ తాను చేశానని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు కరౌలి హింసాత్మక ఘటనలో 42 మంది ప్రజలతోపాటు నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి 46 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. 21 బైకులు, ఇతర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. జైపూర్కు 170 కిలోమీటర్ల దూరంలోని కరౌలిలో మరింత అల్లర్లు చెలరేగకుండా ఉండేందుకు సోమవారం వరకు కర్ఫ్యూ విధించారు. మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేశారు.
एक मां को साथ लिए, सीने से मासूम को चिपकाए दौड़ते खाकी के कदम।#RajasthanPolice के कांस्टेबल नेत्रेश शर्मा के जज्बे को सलाम।
करौली उपद्रव के बीच आमजन की सुरक्षा पुख्ता करने में जुटी पुलिस। @RajCMO @DIPRRajasthan @KarauliPolice pic.twitter.com/XtYcYWgZWs
— Rajasthan Police (@PoliceRajasthan) April 3, 2022