కపుర్తలా: పంజాబ్లోని కపుర్తలాలో (Kapurthala) ఉన్న గురుద్వారా యాజమాన్యం విషయమై చెలరేగిన గొడవను అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులపై ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ఓ పోలీసు మరణించగా, పలువురు గాయపడ్డారు. కపుర్తలాలో ఉన్న ఓ గురుద్వారా (Gurdwara) విషయమై నిహాంగ్ సిక్కుల్లోని (Nihang Sikh) రెండు వర్గాల మధ్య వివాదం నెలకొన్నది. ఈ క్రమంలో ఒక వర్గం వారు గురుద్వారాలోకి ప్రవేశించి దానికి తాళం వేయబోయారు. దానిని అడ్డుకోవడానికి మరో వర్గం వారు ప్రయత్నించడంతో అక్కడ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ నెలకొన్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిహాంగ్ సిక్కు పోలీసులపై కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఓ పోలీసు అధికారి మరణించాడని కపుర్తలా ఎస్పీ తేజ్బీర్ సింగ్ హుండల్ (Tejbir Singh Hundal) తెలిపారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు.
ఇప్పటివరకు పది మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. సుమారు 30 మంది నిహాంగ్లు గురుద్వారాలోనే ఉన్నారని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని చెప్పారు. విషయం తెలుసుకున్న సీనియర్ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పోలీసులు సిబ్బందిని మోహరించారు. కాగా, 2020లో పాటియాలాలో (Patiala) ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. కరోనా లాక్డౌన్ (Covid lockdown) విధించడానికి ప్రయత్నించిన ఓ ఓ పోలీస్ ఆఫీసర్ చేతిని నిహాంగ్ ఆందోళనకారులు నరికివేశారు.