న్యూఢిల్లీ: ఢిల్లీలోని మాల్వియానగర్లో ఉన్న ఫ్లోరిష్ ఇన్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో 21 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనతో లింకున్న హోటల్ కుక్ కేశవ నేగి(Cook Keshav Negi)ని పోలీసులు అరెస్టు చేశారు. వంటమనిషి కేశవ్ నేగి నిర్లక్ష్యం వల్లే.. హోటల్లో అగ్నిప్రమాదం భారీగా జరిగినట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువుర్ని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ ఓనర్ లవ్కేశ్ బజాజ్ను కూడా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కుక్ కేశవ్ నేగి నిర్లక్ష్యం వల్లే మంటలు చాలా వేగంగా వ్యాపించినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు నేగి హోటల్ నుంచి పరారీ అయినట్లు గుర్తించారు. కిచెన్లో ఉన్న ఎలక్ట్రిక్ స్టవ్ను ఆన్ చేయగానే అది పేలిందని, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయని, దీంతో మెయిన్ పవర్ను స్విచ్ ఆఫ్ చేశానని, దట్టమైన పొగ కమ్ముకోవడంతో అక్కడ నుంచి పరుగెత్తినట్లు ఓ మీడియాతో కుక్ నేగి తెలిపారు.
అయితే కుక్ కేశవ్ నేగి పవర్ సప్లయ్ను స్విచాఫ్ చేయడం వల్ల హోటల్లోని ఎలక్ట్రానిక్ డోర్లు లాక్ అయినట్లు పోలీసులు తమ విచారణలో అంచనా వేశారు. దీని వల్ల వల్లే అనేక మంది తమ రూముల్లోనే ట్రాప్ అయినట్లు తేల్చారు. డోర్ను ఓపెన్ చేయలేకపోవడం వల్ల ఓ భార్యాభర్తల జంట ఊపిరి ఆడక తమ రూమ్లోనే ప్రాణాలు విడిచారు. కుక్ కేశవ్ నేగి నిర్లక్ష్యం వల్లే చాలా మంది కస్టమర్లు మంటలు వ్యాపిస్తున్న వేళ బయటకు వెళ్లలేకపోయినట్లు తేల్చారు. అయితే ఈ ఘటనకు చెందిన పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. హోటల్ సిబ్బంది, ప్రాపర్టీతో సంబంధం ఉన్నవారిని కూడా విచారిస్తున్నారు.
బుధవారం జరిగిన ప్రమాదంలో 21 మంది మృతిచెందగా, దాంట్లో 11 మంది విదేశీయులు ఉన్నారు. అయిదు అంతస్తుల భవంతిలో 22 రూమ్లు ఉన్నాయి. ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ ఒక్కటే ఉంది. కిటికీలను పర్మనెంట్గా సీల్ చేశారు. మెయిర్ డోర్ను సెన్సార్లతో ఆపరేట్ చేస్తుంటారు. గ్రౌండ్ ఫ్లోర్లో రెస్టారెంట్ ఉంది. బేస్మింట్తో పాటు పై ఫ్లోర్లలో హోటల్ గదులు ఉన్నాయి.