అహ్మదాబాద్ : మైనర్ బాలిక హత్యాచార కేసులో దోషిగా తేలిన వ్యక్తి ఆగ్రహంతో జడ్జిపైకి చెప్పు విసిరిన ఘటన గుజరాత్లోని సూరత్ జిల్లా కోర్టులో బుధవారం వెలుగుచూసింది. ఐదేండ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన కేసులో వ్యక్తి (27)కి సూరత్ కోర్టు యావజ్జీవ ఖైదు విధించింది.
బాధితురాలికి రూ 20 లక్షల పరిహారం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. పోక్సో కోర్టు న్యాయమూర్తి పీఎస్ కళ తీర్పు వెలువరించిన అనంతరం దోషి సుజిత్ సాకేత్ ఆవేశంతో తన చెప్పును జడ్జి వైపు విసిరాడు. చెప్పు జడ్జికి తగలకుండా విట్నెస్ బాక్సు వద్ద పడిపోయింది.
తప్పుడు కేసులో తనను ఇరికించారని దోషి ఆరోపించాడు. మధ్యప్రదేశ్కు చెందిన సుజిత్ సాకేత్ ఏప్రిల్ 30న వలస కూలీ కూతురైన మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేశాడు. చాక్లెట్ ఆశచూపి బాలికను నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై పట్టుబడతాననే భయంతో ఆధారాలు లేకుండా చేసేందుకు బాలికను ఊపిరిఆడకుండా చేసి హత్య చేశాడు.