డెహ్రాడూన్: మత మార్పిడులు ఎలా జరుగుతాయి? ఎందుకు జరుగుతాయి? అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. మత మార్పిడులు చేసే వారు కూడా తప్పు చేస్తున్నారని తెలిపారు. ఆదివారం ఉత్తరాఖండ్లోని హల్ద్వానీలో జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, వారి కుటుంబాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. హిందూ యువతీ, యువకులు మతం మారడం తప్పు అని చెప్పారు. హిందూ మతం, సాంప్రదాయాల పట్ల గర్వపడేలా యువతీ, యువకులకు అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందన్నారు.
‘మత మార్పిడులు ఎలా జరుగుతాయి? హిందూ అమ్మాయిలు, అబ్బాయిలు తమ స్వార్థం కోసం, వివాహం కోసం ఇతర మతాలను ఎలా స్వీకరిస్తారు?’ అని భగవత్ ప్రశ్నించారు. మత మార్పిడులను ప్రోత్సహించేవారిదీ తప్పేనని, కానీ అది వేరే విషయమని ఆయన అన్నారు.
మన పిల్లలను మనం సరిగా తీర్చిదద్దలేమా? అని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రశ్నించారు. హిందూ విలువలను మనం ఇంటి వద్ద పిల్లలకు నేర్పాలని ఆయన సూచించారు. మన మతం, మన ఆరాధన, సంప్రదాయం పట్ల మన పిల్లల్లో గౌరవం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తల్లీదండ్రులు అయోమయంలో పడకుండా ఈ విషయంలో తమ పిల్లలకు సమాధానం చెప్పాలని ఆయన కోరారు. ‘పిల్లల నుంచి ప్రశ్నలు ఎదురైతే వాటికి సమాధానం ఇవ్వండి. అయోమయంలో పడకండి. మనం మన పిల్లలను సిద్ధం చేయాలి. దాని కోసం ముందు మనం నేర్చుకోవాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
హిందుత్వంతోపాటు కుటుంబ విలువలు, సంప్రదాయాలను కూడా పరిరక్షించాలని మోహన్ భగవత్ కోరారు. దీని కోసం భారతీయ పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని, ఇంటి పెరటిలో పండించే ఆహారాన్ని తినాలని, సాంప్రదాయ దుస్తులు ధరించాలని ఆయన సూచించారు. భాష, ఆహారం, భక్తి పాటలు, ప్రయాణం, దుస్తులు, ఇల్లు.. ఈ ఆరు ‘మంత్రాలు’ భారతీయ సంస్కృతి మూలాలకు మనం అనుసంధానంగా ఉండటానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.
సంప్రదాయ ఆచారాలను పాటించాలని పిలుపునిచ్చిన భగవత్, అదే సందర్భంలో అస్పృశ్యతను నివారించాలని నొక్కి చెప్పారు. ‘కులం ప్రాతిపదికన భేదం చూపవద్దు. అంటరానితనం ఉండకూడదు. పేర్ల నుండి మతాన్ని అంచనా వేయడానికి సమాజం అలవాటు పడింది. వ్యక్తుల మధ్య ఉన్న ఈ భేదాన్ని హృదయం నుంచి పూర్తిగా తొలగించాలి’ అని అన్నారు.
నీటిని ఆదా చేయడం, మొక్కలు నాటడం వంటి పర్యావరణ సమస్యలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరుపాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రజలను కోరారు. ‘హిందువు మేల్కొన్నప్పుడే, ప్రపంచం మేల్కొంటుంది’ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.