Salman Khurshid | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. సన్రైజ్ ఓవర్ అయోధ్య అనే టైటిల్తో ఖుర్షీద్ రాసిన పుస్తకంతో ఆయన తనతోపాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, నాయకులు రాహుల్గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రాలను వివాదంలోకి లాగారు.
సన్ రైజ్ ఓవర్ అయోధ్య అనే ఈ పుస్తకంలో ఖుర్షీద్.. హిందుత్వను ఐఎస్ఐఎస్, బొకోహరం వంటి ఉగ్రవాద సంస్థలతో పోల్చారు. ఈ పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించగా.. 24 గంటల్లో ఖుర్షీద్పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు వివేక్ గార్గ్ అనే న్యాయవాది ఫిర్యాదు చేశారు. హిందుత్వకు అప్రతిష్ఠ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని.. ఖుర్షీద్పై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను అభ్యర్థించారు. దీనిపై బీజేపీ కూడా స్పందించింది. సోనియా, రాహుల్, ప్రియాంకలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది..
అయితే, ఈ పుస్తకంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ విభేదించారు. ఐఎస్ఐఎస్తోనూ, జిహాదీ ఇస్లాంతోనూ హిందుత్వను పోల్చడాన్ని తప్పుపట్టారు. ఈ అంశంపై ఖుర్షీద్ అతిశయోక్తులు రాశారని పేర్కొన్నారు. హిందుత్వపై సల్మాన్ ఖుర్షీద్ తన పుస్తకంలో రాసిన అభిప్రాయంతో ఏకీభవించలేమన్నారు. సమ్మిళిత హిందూయిజంలో భాగమైన హిందుత్వ ఒక ప్రత్యేక రాజకీయ సిద్ధాంతం అని తాము అంగీకరించబోమని ఆజాద్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.
ఖుర్షీద్ పుస్తకంపై బీజేపీ మండిపడింది. సోనియా, రాహుల్ ఆదేశాల మేరకే ఆయన ఈ పుస్తకం రాశారని ఆరోపించింది. ఇది సల్మాన్ ఖుర్షీద్, కొందరు కాంగ్రెస్ నేతల వైఖరి మాత్రమే కాదు.. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం అని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఆరోపించారు. దేశ ఐక్యత కోసం భాగస్వాములైన వారి, దేశంలోని మెజారిటీ ప్రజల మనోభావాలను ఈ సిద్ధాంతం అణచివేస్తుందని వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఇలా పదేపదే జరుగుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి హిందువులపై గౌరవం ఉంటే, తన మౌనం వీడాలని డిమాండ్ చేశారు. మీరు మౌనంగా ఉంటే, హిందువులను ద్వేషించడమే కాంగ్రెస్ సిద్ధాంతం అని తాము నమ్మాల్సి వస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో హిందుత్వ అంటే ఐఎస్ఐఎస్, బొకోహరాం అని రాహుల్, ప్రియాంక చెప్పగలరా? అని ప్రశ్నించారు.