Computer baba @ Jodo yatra | మధ్యప్రదేశ్లో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతున్నది. ఈ యాత్రలో వివాదాస్పద స్వయం ప్రకటిత దేవుదైన నామ్దేవ్ దాస్ త్యాగీ అకా పాల్గొన్నారు. ఈయననే కంప్యూటర్ బాబాగా పిలుస్తుంటారు. శనివారం ఉదయం అగర్-మాల్వా జిల్లాలోని మహుదియా గ్రామంలో త్యాగి రాహుల్ గాంధీతో యాత్రలో నడిచారు. జోడో యాత్రలో పాల్గొన్న ఆయన.. రాహుల్తో చాలా విషయాల గురించి మాట్లాడారు. జై శ్రీరామ్ అనకుండా జై సియారామ్ అనేలా బీజేపీ వారిపై ఒత్తిడి తేవాలని తనకు ఈ బాబాయే చెప్పినట్లు రాహుల్ వెల్లడించారు.
ఓ ఆక్రమణ కేసులో అరెస్ట్ అయిన ఈ బాబా.. రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనడంపై బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఇండోర్ సమీపంలోని తన ఆశ్రమంలో అక్రమంగా నిర్మించారని ఆరోపిస్తున్న భవనాన్ని కూల్చివేత సందర్భంగా పంచాయతీ సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఈయనపై రెండేండ్ల క్రితం కేసు నమోదు కావడంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
రాహుల్ జోడో యాత్రలో కంప్యూటర్ బాబా పాల్గొనడంపై ఇటీవలే కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన నరేంద్ర సలూజా తీవ్రంగా విమర్శించారు. మొన్న కన్హయ్యకుమార్.. నిన్న స్వర భాస్కర్.. ఇవాళ కంప్యూటర్ బాబా.. వీళ్లంతా జోడో యాత్రలో పాల్గొంటున్నారంటే ఇది ఎలాంటి జోడో యాత్రనో అర్థం చేసుకోవచ్చునన్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించిన కేసులో నిందితుడిగా ఉన్నారని, ఇవే ఆరోపణలపై జైలుకెళ్లినట్లు ఆయన చెప్పారు. ఇలాంటి వ్యక్తి రాహుల్తో కలిసి జోడో యాత్రలో ఎలా నడుస్తాడని ప్రశ్నించాడు. బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ మాజీ మంత్రి రాజ్కుమార్ పటేల్ స్పందించారు. భారత్ జోడో యాత్రలో పలువురు సీర్లు, మత పెద్దలు భాగమవుతున్నారని చెప్పారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యాత్రలో పాల్గొనడానికి ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తున్నట్లు ఆయన తెలిపారు.