న్యూఢిల్లీ, మే 29: ఆధార్ వినియోగం విషయంలో కేంద్రం ఆగమాగం చేస్తున్నది. ఆధార్ కార్డులో ఉండే పౌరుల వ్యక్తిగత వివరాల భద్రతపై ప్రజల్లో ఇప్పటికే అనేక అనుమానాలు ఉన్న విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు పలు ప్రభుత్వేతర సంస్థల చేతుల్లోకి వెళ్లిన ఉదంతాలు కూడా చూశాం. ఓటర్ కార్డుకు ఆధార్ను లింక్ చేసేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలపై కోర్టులు అక్షింతలు వేశాయి. వ్యక్తిగత వివరాల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని నొక్కిచెప్పాయి. ఈ నేపథ్యంలో ఆధార్ వినియోగం విషయంలో తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు విరుద్ధ ప్రకటనలు వచ్చాయి. ఆధార్ కార్డు జిరాక్స్ను ఎవరికీ ఇవ్వొద్దని, జిరాక్స్ బదులు మాస్క్డ్ ఆధార్ ఇవ్వాలని సూచిస్తూ యూఐడీఏఐ ఇటీవల చేసిన ప్రకటనను వెనక్కు తీసుకుంటున్నట్టు ఆదివారం కేంద్రం మరో ప్రకటన చేయడం ప్రజల్లో తీవ్ర గందరగోళానికి దారితీసింది.
యూఐడీఏఐ ముందు ఏం చెప్పింది?
ఆధార్ దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ.. ఎక్కడైనా ఆధార్ ఇవ్వాల్సి వస్తే మాస్క్డ్ ఆధార్(చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపిస్తాయి) మాత్రమే ఇవ్వాలని సూచిస్తూ యూఐడీఏఐ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది. ఎవరికీ ఆధార్ జిరాక్స్లను ఇవ్వొద్దని బెంగళూరులోని యూఐడీఏఐ రీజనల్ కార్యాలయం ఓ ప్రకటనలో హెచ్చరించింది. యూఐడీఏఐ నుంచి యూజర్ లైసెన్స్ పొందిన సంస్థలు మాత్రమే వ్యక్తుల గుర్తింపు కోసం ఆధార్ వినియోగించవచ్చని, హోటళ్లు, సినిమాహాల్స్ వంటి లైసెన్స్ లేని సంస్థలకు ఆధార్కార్డు కాపీలను సేకరించే, తమ వద్ద ఉంచుకునేందుకు అనుమతి లేదని, అలా చేస్తే ఆధార్ చట్టం-2016 కింద నేరం అవుతుందని పేర్కొన్నది. కాగా.. యూఐడీఏఐ మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉపసంహరించుకున్నది. యూఐడీఏఐ ప్రకటనను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో తక్షణం ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఆధార్ వినియోగంలో పౌరులు పరిస్థితులను బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని తెలిపింది.