న్యూఢిల్లీ: చైనా వ్యతిరేక ప్రణాళికా విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ విఫలమయ్యారు. చైనాపై ఆధారపడటాన్ని, ఆ దేశంతో వ్యాపారాన్ని తగ్గించేందుకు తెగ ప్రయత్నిస్తున్నామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గొప్పలు పోయింది. అయితే వాస్తవానికి భారత్, చైనా మధ్య వాణిజ్యం మరింత పుంజుకుంది. ఈ ఏడాది మార్చి 2022 వరకు 12 నెలల్లో భారత్, చైనా మధ్య వాణిజ్యం 34 శాతం మేర పెరిగింది. మొత్తం వ్యాపారం 115.83 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు ఇరు దేశాల మధ్య 69.04 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో చైనాతో భారత్ వాణిజ్య లోటు 51.50 బిలియన్ డాలర్లుగా నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 73.31 బిలియన్ల డాలర్లుగా ఉంది.
కాగా, భారత్, చైనా మధ్య ఘర్షణల నేపథ్యంలో ఆ దేశం అత్యంత చౌకగా దిగుమతి చేసే వస్తువులపై కేంద్ర ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. దేశీయ పరిశ్రమలను ప్రోత్సహించేందుకే ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ గొప్పులు పోయింది. అయితే వాస్తవానికి పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. చైనా దిగుమతులపై కేంద్రం ఎన్నో ఆంక్షలు విధించినప్పటికీ ఆ దేశం వీటిని అధిగమించింది. 12 నెలల్లో భారత్, చైనా మధ్య వాణిజ్యం 34 శాతం మేర పెరిగింది. మొత్తం వ్యాపారం 115.83 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గత వారం పార్లమెంట్కు విడుదల చేసిన గణాంకాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.