న్యూఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్ను (Union Budget) ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెడుతున్నారు. కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టినప్పటికీ.. నిరసనల మధ్యే బడ్జెట్ను ప్రతిపాదిస్తున్నారు. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామన్నారు. గత పదేండ్లలో సాధించిన అభివృద్దే తమకు స్ఫూర్తి అని, మార్గదర్శి అన్నారు. గత పదేండ్లలో సాధించిన అభివృద్ధి సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు సాధించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వృద్ధి మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందన్నారు. ఈ సందర్భంగా దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ సూక్తిని ప్రస్తావించారు.
మహిళల పట్ల దృష్టి సారించామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి సాధించడం కోసం అందరిని కలుపుకుపోతున్నామని తెలిపారు. ఇంధన సరఫరాను పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. వ్యవసాయం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించామని, వికసిత భారత్లో సమ్మిళిత వృద్ధి ప్రధానంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుత పథకాలతో అధునాతన వ్యవసాయ పద్ధతులను తీసుకొస్తున్నారు. పంటలను స్టోరేజ్ చేసేందుకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. దీర్ఘకాలిక, స్వల్పకాలిక వ్యవస్థ వల్ల రైతులకు లబ్దిచేకూరుతుందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సంపదను సృష్టించడం కోసం మరిన్ని కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. నైపుణ్యాన్ని, టెక్నాలజీని పెంపొందించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పెంపొందిస్తున్నామన్నారు. చిన్న, సన్నకారు రైతులను వృద్ధి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సాంకేతిక, ఆర్థిక సహాయాన్ని అందిస్తామని, ఫేజ్ -1 కింద 100 గ్రామాలను తీసుకుంటామన్నారు.
పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, రాబోయే నాలుగేండ్లలో పప్పు ధాన్యాలను ప్రత్యక్షంగా సేకరిస్తామని చెప్పారు. కూరగాయాలు, పండ్ల కోసం కొత్త కార్యక్రమాలు తీసుకువస్తామని వెల్లడించారు. సమాజంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తున్నారని, ఇందులో భాగంగా కూరగాయాలు, పండ్ల వినియోగం పెరుగుతుందని చెప్పారు. రైతులకు మరిన్ని లాభదాయక ధరలు పెంచేలా చేస్తామని తెలిపారు.
ప్రపంచంలోనే భారత్ రెండో అతిపెద్ద మత్స్య సంపద కలిగిన దేశమని చెప్పారు. సముద్ర ఉత్పత్తులను ప్రోత్సహిస్తామని, సుస్థిరమైన మత్స్య పద్ధతులను తీసుకువస్తామన్నారు. దీవులపై కూడా ప్రత్యేక దృష్టిసారిస్తామని చెప్పారు. పత్తి రైతుల సంక్షేమం కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. పత్తిలో ఎక్కువ రకాలు తీసుకువస్తామని, ఆదాయం పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంప్రదాయక వస్త్ర ఉత్పత్తిని పెంపొందిస్తామని చెప్పారు.