ముంబై: బీజేపీకి కంచుకోటగా ఉన్న అసెంబ్లీ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 28 ఏళ్లుగా కాషాయ పార్టీ గెలుస్తున్న మహారాష్ట్రలోని కస్బా పేట (Kasba Peth ) సీటును ఉప ఎన్నికలో హస్తగతం చేసుకుంది. గురువారం జరిగిన కౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర ధంగేకర్ గెలిచారు. బీజేపీ అభ్యర్థి హేమంత్ రసానేపై 12,000 ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో కస్బా పేటలో తమ అభ్యర్థి గెలిచినట్లు మహారాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు నానా పటోలే తెలిపారు. ఈ నేపథ్యంలో ముంబైలోని కాంగ్రెస్ కార్యాలయం వద్ద విజయోత్సవ సంబరాలు హోరెత్తాయి. 28 ఏళ్లుగా బీజేపీ గుప్పిట్లో ఉన్న కస్బా పేట స్థానంలో కాంగ్రెస్ గెలుపొందడంతో ఆ పార్టీ శ్రేణుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
కాగా, కస్బా పేట బీజేపీ ఎమ్మెల్యే ముక్తా తిలక్, చించ్వాడ్ బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ జగ్తాప్ ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఈ రెండు నియోజకవర్గాల్లో ఫిబ్రవరి 26న ఉప ఎన్నికలు జరిగాయి. సుమారు 50 శాతం ఓటింగ్ నమోదైంది. అయితే శివసేన చీలిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ కూటమి ప్రభుత్వం గత ఏడాది కూలిపోయింది. దీంతో శివసేన రెబల్ నేత ఏక్నాథ్ షిండే బీజేపీ మద్దతుతో సీఎం అయ్యారు. ఈ పరిణామాల అనంతరం జరిగిన తొలి ఎన్నికల పోరు కావడంతో ఈ రెండు సీట్లపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. బీజేపీ స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం పోటీపడ్డాయి.