జైపూర్: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై మండిపడ్డారు. ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు తమ పార్టీ పని చేసిందని తెలిపారు. మరోవైపు బీజేపీ ప్రజల్లో విభజనలు సృష్టిస్తోందని విమర్శించారు. తాము పేదల కోసం పని చేస్తే, బీజేపీ బడా పారిశ్రామికవేత్తలకు అండగా నిలుస్తున్నదని ఆరోపించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో మూడు రోజులపాటు జరిగిన చింతన్ శివిర్లో పాల్గొన్న రాహుల్ గాంధీ, సోమవారం గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా జిల్లా దుంగార్పూర్లోని వాల్మీకి దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
ధనవంతులు, కొద్ది మంది పారిశ్రామికవేత్తల కోసం దేశాన్ని రూపొందించాలని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ కోరుకుంటున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. మరోవైపు దళితులు, గిరిజనులు, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తున్నదని తెలిపారు. ‘ఇది ఒక పోరాటం. ఇది రెండు సిద్ధాంతాల మధ్య పోరు. అందరినీ కలుపుతూ, అన్ని సంస్కృతులను గౌరవిస్తూ, పరిరక్షిస్తూ మనం ముందుకు సాగాలని కాంగ్రెస్ చెబుతోంది. మరోవైపు బీజేపీ విభజించడానికి, అణిచివేసేందుకు పనిచేస్తుంది’ అని అన్నారు.
కాగా, యూపీఏ ప్రభుత్వం బలంగా తీర్చిదిద్దిన దేశ ఆర్థిక పరిస్థితిని ప్రధాని మోదీ నాశనం చేస్తున్నారని రాహుల్ గాంధీ విమర్శించారు. ‘బీజేపీ ప్రభుత్వం మన ఆర్థిక వ్యవస్థపై దాడి చేసింది. ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేసి, జీఎస్టీని తప్పుగా అమలు చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థ నాశనమైంది. యూపీఏ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేసింది. కానీ మోదీ మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు’ అని మండిపడ్డారు. ఒకవైపు దేశ యువత నిరుద్యోగంలో ఉందని, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, దళితులు, గిరిజనులతోపాటు అన్ని వర్గాల ప్రయోజనం కోసం పని చేస్తున్నదని కొనియాడారు.