Rahul Gandhi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ తిరిగి బాధ్యతలు చేపట్టాలని ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం నిర్ణయించింది. ఆగస్టు 20న రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ఆదివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానించారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో జీ-23 నాయకుల డిమాండ్ మేరకు ఆదివారం సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షత వహించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ మినహా సీడబ్ల్యూసీ సభ్యులు, ఆహ్వానితులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ కొనసాగాలని కూడా ఈ సమావేశం తీర్మాణించినట్లు తెలుస్తున్నది. రాజస్థాన్ రాజధాని జైపూర్లో చింతన్ బైఠక్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు.
జీ-23 గ్రూప్ నేతల నుంచి పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించాలని, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని డిమాండ్లు వచ్చాయి. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ తమ పదవులకు రాజీనామా చేస్తారని వార్తలొచ్చినా.. కాంగ్రెస్ పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వంటి వారు రాహుల్ గాంధీ తిరిగి పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని డిమాండ్ చేశారు.