ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం ఎదురైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అత్యున్నత స్థాయి నిర్ణయాత్మక మండలి అయిన సీడబ్ల్యూసీ సమావేశం ఆదివారం జరగనుంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి నలుగురు కాంగ్రెస్ కీలక నేతలు హాజరు కాలేకపోతున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభ సభ్యుడు ఏకే ఆంటోనీతో సహా మరో ముగ్గురు సీనియర్లు ఈ సమావేశానికి గైర్హాజర్ కానున్నట్లు తెలుస్తోంది.
అనారోగ్య కారణాల రీత్యా మాజీ ప్రధాని మన్మోహన్ ఈ సమావేశానికి హాజరు కాలేకపోతున్నారు. రాజకీయాల నుంచి తాను రిటైర్డ్ కావాలనుకుంటున్నానని, తిరువనంత పురం వెళ్లిపోతున్నట్లు ఈ మధ్యే ఏకే ఆంటోనీ అధ్యక్షురాలు సోనియాకు లేఖ రాశారు. ఈ కారణంగానే ఆంటోనీ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం లేదని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక మరో ముగ్గురు ఎవరనేది బయటికి వెళ్లడించడం లేదు. మొత్తానికి ఐదుగురు కీలక సభ్యులు లేకుండానే అత్యంత కీలకమైన సీడబ్ల్యూసీ భేటీ జరగబోతోంది.
మరోవైపు ఐదు రాష్ట్రాల ఘోర పరాభవానికి నైతిక బాధ్యత వహిస్తూ.. తమ పదవులకు సోనియా, రాహుల్, ప్రియాంక రాజీనామాలు చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఖండించారు. వారెవ్వరూ రాజీనామాలు చేయడం లేదని ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో తాజాగా రెండు పేర్లు బయటికి వచ్చాయి. ముకుల్ వాస్నిక్, మల్లికార్జున ఖర్గే. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు అధ్యక్ష బాధ్యతలు చేపడతారని వార్తలొస్తున్నాయి.