బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly Elections) కాషాయ పార్టీని మట్టికరిపించి 135 స్ధానాలతో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ సంబరాల్లో మునిగితేలుతోంది. బెంగళూర్లో ఆ పార్టీ దిగ్గజ నేతలు ఒకరికొకరు నందిని స్వీట్లు తినిపిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపారు. రాజ్యసభ ఎంపీ రణ్దీప్ సింగ్ సుర్జీవాలా, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఇతర నేతలు నందినీ స్వీట్స్ పంపిణీ చేస్తూ ఆనందం పంచుకున్నారు.
नंदिनी के बिना ये जीत अधूरी है। pic.twitter.com/G7xoJ4HHmv
— Congress (@INCIndia) May 13, 2023
నందిని లేకుండా కర్నాటకలో ఏదీ పూర్తికాదని సుర్జీవాలా చిరునవ్వుతో స్వీట్స్ను పార్టీ అగ్రనేతలకు అందచేసిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. మల్లికార్జున్ ఖర్గేకు నందినీ స్వీట్ బాక్స్ను సుర్జీవాలా అందించగా మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ శివకుమార్కు స్వీట్స్ తినిపించారు. కర్నాటక ఎన్నికల ప్రచారంలో నందినీ అంశం కాంగ్రెస్ పార్టీకి ప్రచారాస్త్రంగా మారిన సంగతి తెలిసిందే.
గుజరాత్ స్టేట్ మిల్క్ కోఆపరేటివ్ బ్రాండ్ అమూల్ బెంగళూర్లో తాజా పాలు, పెరుగు ఆన్లైన్ డెలివరీలు ప్రారంభించనున్నట్టు చేసిన ప్రకటన కలకలం రేపింది. అమూల్ ఎంట్రీతో కన్నడిగులతో పెనవేసుకున్న మిల్క్ ఫెడరేషన్ (కేఎంఎఫ్) బ్రాండ్ నందిని ఉనికి దెబ్బతింటుందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారాస్త్రాంగా కాంగ్రెస్ మలుచుకోవడంతో కాషాయ పార్టీ ఇరకాటంలో పడింది.
Read More