న్యూఢిల్లీ: రాజ్యసభ నుంచి ఇవాళ టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని టీఆర్ఎస్ ఎంపీలు ఇవాళ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు. ఇవాళ సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే.. టీఆర్ఎస్ ఎంపీలు వెల్లోకి దూసుకువెళ్లారు. సురేశ్ రెడ్డి, సంతోష్ కుమార్, బడుగల లింగయ్య యాదవ్లు వెల్లోకి వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. ప్రధానిపై ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్పై నిర్ణయం తీసుకోవాలని ఎంపీ కేశవరావు డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ను కోరారు. ఆ సందర్భంలో ఆయన స్పందిస్తూ.. సభా హక్కుల నోటీసు అందిందని, కానీ దానిపై చైర్మెన్ వెంకయ్య నిర్ణయం తీసుకుంటారని హరివంశ్ తెలిపారు. చైర్మెన్ పరిశీలన కోసం ప్రివిలేజ్ నోటీసును పంపినట్లు ఆయన చెప్పారు. కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలు కూడా టిఆర్ఎస్ వాదనతో ఏకీభవించిచాయి. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖార్గే కూడా టిఆర్ఎస్ కు మద్దతు పలికారు. ప్రివిలేజ్ నోటీసుపై ఛైర్మన్ నిర్ణయం తీసుకునే వరకు సభకు వెళ్లరాదని తెరాస ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి తీరుపై మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై ప్రధాన చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు… అదేవిధంగా ఎనిమిదేళ్ల తర్వాత కూడా ప్రధాని మీడియా సమావేశంలో ప్రశ్నల వర్షం కురిపించకుండా, మీడియాకు ఇచ్చే ఇంటర్వ్యూలపైనే ఆధారపడాల్సి రావడం సిగ్గుచేటు అన్నారు. రెండు సభల్లో పాసైన బిల్లుపై ప్రధాని కామెంట్ చేయడం శోచనీయమన్నారు.
లోక్సభలోనూ..
ప్రధాని మోదీపై లోక్సభలో కూడా ప్రివిలేజ్ నోటీసు తెరాస ఎంపీలు ఇవ్వనున్నారు. ఈ మధ్యాహ్నం స్పీకర్ను కలిసి ప్రివిలేజ్ నోటీసు ఇస్తారు. సాయంత్రం 4గం.లకు సభ ప్రారంభమైన అనంతరం నిరసన తెలపాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రివిలేజ్ నోటీసుపై స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సభను బాయ్కాట్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.