Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడుదశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న రాయ్బరేలి, అమేథీ లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. బుధవారం యూపీ నుంచి నలుగురు అభ్యర్థులను ప్రకటించినా..ఈ జాబితాలోనూ రాయ్బరేలీ, అమేథీ నుంచి అభ్యర్థులను ప్రకటించకపోవడంతో కార్యకర్తలు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు వేచి చూసి ధోరణిని కొనసాగిస్తున్నారు. అమేథీ, రాయ్బరేలీ ప్రాంతాలకు చెందిన నేతలు ప్రియాంక గాంధీతో పాటు ఇతర సీనియర్ నేతలతో సమావేశమై గాంధీ కుటుంబానికి వ్యక్తి అభ్యర్థిత్వంపై చర్చించారు. అదే సమయంలో భారత్ కూటమి అభ్యర్థిగా వరుణ్ గాంధీని అమేథీ నుంచి పోటీ చేయించనున్నట్లు ఊహాగానాలున్నాయి. పిలిభిత్ నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత వరుణ్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి 8వ జాబితాకు ముందు బుధవారం కాంగ్రెస్ అగ్రనాయకత్వం చాలా మేధోమథనం చేసింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఉత్తరప్రదేశ్, గోవా, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లపై కూలంకషంగా చర్చించారు. సమావేశంలో 40 మంది పేర్లు చర్చకు వచ్చాయి. ఈ భేటీలో కూడా అమేథీ, రాయ్బరేలీ స్థానాలపై చర్చ జరగలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తదుపరి సమావేశం 31న జరగనుంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ తన స్టార్ క్యాంపెయినర్ల పేర్లను కూడా ప్రకటించింది. ఇందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు ఉన్నాయి. అదే సమయంలో, మధ్యప్రదేశ్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మాజీ ముఖ్యమంత్రులు కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి.
బీజేపీ అమేథీ నుంచి స్మృతి ఇరానీ పేరును ఖరారు చేసింది. కానీ, రాయ్బరేలీ నుంచి ఇంకా తన కార్డులను తెరవలేదు. కుమార్ విశ్వాస్ సహా మరికొందరు నేతల పేర్లపై పలు ఊహాగానాలు సాగుతున్నాయి. బుధవారం కాంగ్రెస్ నలుగురి పేర్లతో జాబితాను ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో ఎస్పీతో కూటమి కింద కాంగ్రెస్కు 17 సీట్లు వచ్చాయి. గత వారం తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. నలుగురు అభ్యర్థులను బుధవారం ప్రకటించారు. అయితే, అమేథీ, రాయ్బరేలీ స్థానాలతో పాటు మధుర పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిని ఎవరు బరిలోకి దిగునున్నారనే ఉత్కంఠ నెలకొన్నది. ప్రయాగ్రాజ్ లోక్సభ నియోజకవర్గం నుంచి సీనియర్ ఎస్పీ నేత, మాజీ ఎంపీ రేవతి రమణ్సింగ్ కుమారుడు ఉజ్వల్ రమణ్ సింగ్ను బరిలోకి దింపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని విశ్వసనీయ సమాచారం. ఆయన త్వరలోనే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్నది.