బెంగళూర్ : వారసత్వ రాజకీయాల గురించి పదేపదే విమర్శలు గుప్పించే బీజేపీ కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) తమ పార్టీ నేతల కుటుంబ సభ్యులకు పెద్దసంఖ్యలో టికెట్లు కేటాయించిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. 20 మంది బీజేపీ నేతల కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే అభ్యర్ధులుగా బరిలో దింపిందని పేర్కొంది.
కాషాయ పార్టీ వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తూ ఇతర పార్టీలను వారసత్వ పార్టీలని విమర్శిస్తోందని ఎద్దేవా చేసింది. అసెంబ్లీ సీట్ల కోసం బీజేపీ నేతలు సిగపట్లకు దిగారని, సీనియర్ నేతలను కాషాయ పార్టీ అవమానించిందని కాంగ్రెస్ ఎంపీ రణ్దీప్ సుర్జీవాలా ఆరోపించారు. పలువురు నేతలు రాజీనామా చేశారని, కర్నాటకలో 40 పర్సెంట్ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా 40 మంది రెబెల్స్ ఎన్నికల బరిలో నిలిచారని అన్నారు.
వారసత్వ రాజకీయాలపై విమర్శలు గుప్పించే ప్రధాని మోదీ కర్నాటకలో 20 మంది బీజేపీ నేతల కుటుంబ సభ్యులకు పార్టీ టికెట్లు కేటాయించిన విషయం మరిచిపోయారని సుర్జీవాలా చురకలు వేశారు. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనుండగా మే 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
India Corona | డేంజర్ బెల్స్.. 11 వేలకు పైనే కొత్త కేసులు.. 29 మరణాలు